ఆ పాప ఇకలేదు.. ఇంజెక్షన్ కోసం రూ.కోట్లు, క్రౌడ్ ఫండింగ్.. రూ.40 లక్షలు జమ
రాజస్తాన్ బికనీర్కు చెందిన 7 నెలల చిన్నారి నూర్ ఫాతిమా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. ఆమె స్పైనల్ మస్కులర్ అట్రోపీ (ఎస్ఎమ్ఏ) అరుదైన వ్యాధితో బాధపడ్డారు. మంగళవారం ఉదయం మరణించడంతో విషాదం నెలకొంది. చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ మాత్రమే ఆధారమైన సంగతి తెలిసిందే.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే 'జొలెస్మా' ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది. ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. పాప తండ్రి జిసాన్ అహ్మద్ ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తమ బిడ్డపై ఆశలు వదిలేసుకున్నారు.
ఇటీవలే హైదరాబాద్కు చెందిన అయాన్ష్ గుప్తా ఇదే వ్యాధితో బాధపడుతున్న వేళ క్రౌడ్ ఫండింగ్ పేరుతో ఏడాది ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్లైన్ వేదికగా రూ. 16 కోట్లు విరాళాలు సేకరించి ఆ బాబును బతికించారు. విషయం తెలుసుకున్న జిసాన్ అహ్మద్కు మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో పాప ఇంజెక్షన్కు విరాళాలు సేకరించేందుకు మిత్రులు, సోషల్ మీడియా గ్రూపులను సంప్రదించాడు. ఇప్పటివరకు క్రౌడ్ ఫండింగ్ పేరుతో రూ.40 లక్షలు పోగయ్యాయి. దురదృష్టం కొద్ది ఆ చిన్నారి మంగళవారం కన్నుమూయడంతో విరాళం అందించిన వారు పాపను బతికించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు.
ఉదయం నాలుగు గంటల సమయంలో పాప బాగానే ఉందని పాప తండ్రి జిసాన్ అహ్మద్ తెలిపారు. ఆకలితో ఏడ్వడంతో పాపకు పాలు పట్టిచ్చి మళ్లీ నిద్రపుచ్చామని... కానీ ఉదయం ఏడు గంటల సమయంలో పాపను లేపడానికి ప్రయత్నించగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులున్నట్లు గమనించామని వివరించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని.. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు దృవీకరించారని చెప్పారు.
పాప ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంజెక్షన్కు రూ. 16 కోట్లు అవసరం కాగా.. ఇప్పటివరకు రూ. 40 లక్షలు సేకరించాం అని.. అయితే పాప చనిపోవడంతో మాకు విరాళం అందించిన వారికి డబ్బు తిరిగిచ్చేస్తాం. అని కన్నీటిపర్యంతమయ్యాడు.