1960 నుంచి చైనా ఆక్రమణలో ఉన్న ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంపైనే బ్రిడ్జి కడుతోంది: కేంద్రం
న్యూఢిల్లీ: ప్యాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన 1960 నుంచి ఆ దేశం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతంలో ఉందని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి, ఈ విషయంపై మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
భారతదేశ భూభాగంలో ఇటువంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించలేదని, "అలాగే అన్యాయమైన చైనా వాదనను లేదా అటువంటి నిర్మాణ కార్యకలాపాలను మేము అంగీకరించలేదు" అని అన్నారు.
'చైనా దాని మునుపటి వంతెనతో పాటు పాంగోంగ్ సరస్సుపై వంతెనను నిర్మిస్తున్నట్లు మేము నివేదికలను చూశాము' అని బాగ్చి చెప్పారు. "ఈ రెండు వంతెనలు 1960 నుంచి చైనా ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాలలో ఉన్నాయి' అని బాగ్చి వెల్లడించారు.
'జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసాము. ఇతర దేశాలు భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాయని మేము ఆశిస్తున్నాము' అని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.
దేశం భద్రతా ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించేలా చూసేందుకు ప్రభుత్వం ముఖ్యంగా 2014 నుంచి సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసిందని, ఇందులో రోడ్లు, వంతెనల నిర్మాణం కూడా ఉన్నాయని బాగ్చి తెలిపారు.
'భారతదేశం వ్యూహాత్మక, భద్రతా అవసరాలను తీర్చడమే కాకుండా, ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధిని సులభతరం చేయడానికి సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను సృష్టించే లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.