భారత్పై చైనా హైబ్రిడ్ యుద్ధం?: ప్రధాని, సీజేఐ, ముఖ్యమంత్రులు: 10 వేలమంది శక్తిమంతుల డేటా
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలను సృష్టిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా.. మరో అడుగు ముందుకేసిందా? భారత్పై సైబర్ యుద్ధానికి తెర తీసిందా? హైబ్రిడ్ యుద్ధాన్ని ప్రకటించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత్లో అత్యంత శక్తిమంతులుగా గుర్తింపు పొందిన 10 వేలమందికి పైగా ప్రముఖులపై నిఘా వేసినట్లు వెల్లడైంది. వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా నెట్వర్క్ను రూపొందించుకున్నట్లు తేటతెల్లమైంది. దీనిపై ప్రముఖ జాతీయ దినపత్రిక ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది.
Recommended Video
సహనాన్ని పరీక్షించొద్దు: సైనికుల దుందుడుకుపై అసహనం: చైనా ముఖం పగులగొట్టేలా భారత్
రాష్ట్రపతి మొదలుకుని..
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మొదలుకుని ముఖ్యమంత్రుల వరకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డె దగ్గరి నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తల వరకు కొందరు ప్రముఖుల డేటాపై నిఘా ఉంచిందనే విషయాన్ని వెల్లడించింది. కొందరు టాప్ క్రిమినల్స్పైనా నిఘా ఉంచిందని ఈ కథనం పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేబినెట్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయెల్, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అశోక్ గెహ్లాట్, అమరీందర్ సింగ్, ఉద్ధవ్ థాకరే, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి రాజకీయ నేతలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఆర్మీ అధికారులు కూడా చైనా రాడార్ పరిధిలో..
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ నౌకాదళం, వాయుసేనకు చెందిన మాజీ అత్యున్నత అధికారులపైనా డేటా నిఘా వేసినట్లు ఈ కథనం ద్వారా తేలింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డె, లోక్పాల్ జస్టిస్ పీసీ ఘోష్, కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్చంద్ర ముర్ము, భారత్పే యాప్ వ్యవస్థాపకుడు నిపుణ్ మెహ్రా, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, గౌతమ్ అదాని సహా కీలక హోదాల్లో పనిచేస్తోన్న బ్యురోక్రాట్లు, జర్నలిస్టులు, నటులు, క్రీడాకారులపైనా చైనా నిఘా వేసిందని నిర్ధారించింది. కొందరు క్రిమినల్స్ను కూడా తన రాడార్ పరిధిలోకి తీసుకొచ్చిందని స్పష్టం చేసింది.
నిఘా ఎలా అంటే..?
గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెన్జెన్లోని టెక్నాలజీ కంపెనీ షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ ద్వారా భారత ప్రముఖులపై రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తోందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. ప్రముఖుల డేటాపై నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ (ఓకేఐడీబీ) ఆ సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ.. చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై ఆరా తీయడానికి బిగ్ డేటా టూల్స్ను వినియోగించి రెండు నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది.