అలాంటి వ్యూహాలు భారత్ ముందు కుదరవు... చైనాపై ఆర్మీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు...
ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా,ప్రాణనష్టం జరగకుండా తమ విస్తరణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనే చైనా లక్ష్యం,వ్యూహం భారత్ ముందు పనిచేయవని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అన్నారు. సరిహద్దులో 'స్టేటస్ కో'ని కొద్ది కొద్దిగా మారుస్తూ ముందుకెళ్లే వ్యూహం చైనాకు అలవాటని... తద్వారా ప్రత్యర్థి నుంచి పెద్దగా రియాక్షన్ ఉండదని డ్రాగన్ కంట్రీ భావిస్తుందన్నారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద జలభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుందన్నారు. అయితే భారత్తో అలాంటి వ్యూహాలు కుదరవని అన్నారు. చైనా ప్రతీ చర్యకు భారత్ నుంచి గట్టి రియాక్షన్ ఉంటుందన్నారు. బుధవారం(ఫిబ్రవరి 24) వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన వెబినార్లో నరవణే మాట్లాడారు.
'ప్రస్తుతం సరిహద్దులో భారత్-చైనా సైనిక బలగాల ఉపసంహరణ శుభ పరిణామం. ఇది ఇరువురికి విన్-విన్ సిచ్యుయేషన్ అని చెప్పవచ్చు. ఏ ఒప్పందానికైనా ఇరు వర్గాలకు తామేదో సాధిస్తున్నామనే భావన కలగాలి. ఆ లెక్కన ఇప్పుడు జరుగుతున్న సైనిక ఉపసంహరణ మంచి పరిణామమే.' అని నరవణే అభిప్రాయపడ్డారు.

ఇటీవలే ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి మొదటి దశ సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన సంగతి తెలిసిందే. దెస్పాంగ్,గోగ్రా పోస్ట్,హాట్ స్పింగ్ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఇంకా చేపట్టాల్సి ఉంది. అందుకోసం భారత్కు తమవైన కొన్ని వ్యూహాలు ఉన్నాయని నరవణే తెలిపారు. అత్యంత కఠినమైన చలి వాతావరణంలోనూ తూర్పు లదాఖ్లో చైనాను ఎదుర్కొన్న భారత సైనికులను ఆయన అభినందించారు. సరిహద్దులో ఇంకా డీ-ఎస్కలేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని... దానికి ఇంకా చాలా సమయం పడుతుందని అన్నారు.
కాగా,దాదాపు 9 నెలలుగా భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించుతూ సైన్యం ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ,ఉత్తర తీరాల్లో ఇరు దేశాలు ఇటీవలే తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. నిజానికి ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించినప్పటికీ.. అంతకన్నా ముందే ఇది పూర్తవడం విశేషం.












Click it and Unblock the Notifications