బుద్ధి పోనిచ్చుకోని చైనా: లఢక్ వద్ద మళ్లీ యుద్ధ వాతావరణం: అత్యాధునిక జెట్ ఫైటర్లతో
బీజింగ్: గత ఏడాది భారత్తో లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి దారి తీసిన గాల్వన్ వ్యాలీ ఘర్షణల అనంతరం చైనా..మరోసారి అలాంటి పరిస్థితులకు తెర తీసింది. సరిహద్దులను ఉద్రిక్తంగా మార్చివేసింది. లఢక్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ సమీపంలో పెద్ద ఎత్తున జెట్ ఫైటర్లను ఇదివరకే మోహరించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు.. ఇంకో అడుగు ముందుకేశారు. ఏకంగా జెట్ ఫైటర్లతో యుద్ధ విన్యాసాలను చేపట్టారు. 20కి పైగా జెట్ ఫైటర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నట్లు భారత ఆర్మీ అధికారులు నిర్ధారించారు.
సుమారు 22 చైనాకు చెందిన యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖకు అటువైపు.. చైనా భూభాగంపై రెండు రోజులుగా చైనా వైమానిక దళాధికారులు ఈ విన్యాసాలను నిర్వహిస్తోన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను తెప్పించుకుంటోన్నామని, చైనా కదలికలను నిశితంగా గమనిస్తున్నామని అన్నారు.
వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న హోటన్, గర్ గున్షా, కష్ఘర్ ఎయిర్బేస్ స్టేషన్ను కేంద్రంగా చేసుకుని చైనా వైమానిక దళాధికారులు జెట్ ఫైటర్ల యుద్ధ విన్యాసాలను చేపట్టారని వివరించారు. జె-11, సుఖోయ్-27, జె-16, ఫైటర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటోన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ మూడు ఎయిర్బేస్ స్టేషన్లను చైనా అధికారులు ఈ మధ్యకాలంలోనే మరింత అభివృద్ధి చేశారని, అన్ని రకాల యుద్ధ విమానాలు ఈ మూడు చోట్లా ల్యాండ్ అయ్యేలా తీర్చిదిద్దారని తెలిపారు.
చైనా అధికారులు లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్దే వైమానిక బలగాలను మరింత బలోపేతం చేసుకోవడానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నామని అన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా స్పందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. చైనా ఇలాంటి చర్యలకు తెగబడే అవకాశం ఉందని ముందుగానే పసిగట్టామని, అందుకే లఢక్ వద్ద సరిహద్దుల్లో తాము కూడా పెద్ద ఎత్తున వైమానిక బలగాలను రొటేషన్ పద్ధతిన మోహరింపజేసినట్లు తెలిపారు. మిగ్-29తో సరిహద్దులను పహారా కాస్తున్నామని అన్నారు. ఈ పహారాలో తరచూ రాఫెల్ యుద్ధ విమానాలను భాగస్వామ్యం చేస్తోన్నామని చెప్పారు.