ట్రంప్కు చైనా వార్నింగ్: అమెరికా ఆ పని చేస్తే.. ఇక వాణిజ్య యుద్దమే!
చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారణకు ఆదేశిస్తే.. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.
బీజింగ్: అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం చెలరేగే దిశగా ఇరు దేశాల మధ్య పరిస్థితులు నెలకొన్నాయి. తమ టెక్నాలజీని, మేథో సంపత్తిని చైనా చోరీ చేస్తుందని అమెరికా అనుమానిస్తుండటంతో ఈ రెండు దేశాల వాణిజ్య సంబంధాలపై అది ప్రభావం చూపనుంది.
ఈ వ్యవహారంపై చైనా మీడియాలో ఆ దేశ ఆర్థిక నిపుణుడు మై జిన్ యూ ఒకరు ఘాటుగా స్పందించారు. చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారణకు ఆదేశిస్తే.. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.
అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సహకార సంస్థకు చెందిన అధికారి అయిన మై జిన్.. చైనా డైలీ పత్రికలో ఈ వివాదంపై వ్యాసం రాశారు. అమెరికా టెక్నాలజీని, మేధో సంపత్తిని చైనా చోరీ చేసిందంటూ వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్-301 ప్రకారం ట్రంప్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలకడగా ఉన్నాయని, ట్రంప్ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంటే అది వాణిజ్య యుద్దాన్ని ప్రేరేపించడమే అవుతుందని అన్నారు.