రాజీనామా ఆమోదింపజేయండి: సోనియాకు చిరు లేఖ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయానికి నిరసనగా కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీకి లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదింపజేయాలని ఆయన ఆ లేఖలో సోనియాను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లేఖ రాశారు.
ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన తన రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించానని గుర్తు చేస్తూ యుపిఎ చైర్పర్సన్గా అది ఆమోదం పొందేలా చూడాలని ఆయన సోనియాను కోరారు. హృదయ భారంతో, ప్రస్తుత స్థితిలో మంత్రిగా తన బాధ్యతలను నిర్వహించలేనని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన పరిణామం తనను తీవ్రంగా బాధిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవల మంత్రి వర్గం చేసిన తీర్మానంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అంశాలు లేవని, ఆ తీర్మానం సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించలేదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన అనివార్యమైన స్థితిలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని చిరంజీవి పట్టుబడుతూ వచ్చారు. కానీ, అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. శుక్రవారం ఉదయం చిరంజీవి బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడిని కలిశారు. మరో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా వెంకయ్యనాయుడిని కలిశారు. రాష్ట్ర విభజనకు సహకరించవద్దని వారిద్దరు వెంకయ్యనాయుడిని కోరారు. చిరంజీవి మంత్రి వదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా చిరంజీవి దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వారిద్దరు కూడా సోనియా గాంధీకి లేఖలు రాయనున్నట్లు తెలుస్తోంది.