జయకు ఈయన చెప్పిందే వేదం: అందుకే తుగ్లక్ !
చెన్నై: నాటక రచయిత, న్యాయవాది, సినిమా స్క్రిప్టు రచయిత, పత్రికా రచయిత, అంతకు మంచి మంచి సినిమా నటుడు ఇలా చో రామస్వామి గురించి చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సమయం సరిపోదు. ఆయన గురించి చెప్పాలంటే చాల అంశాలే ఉన్నాయి.
ప్రతి రోజు నుదటన విభూది బొట్టు, పెద్ద కళ్లజోడు, నున్నగా గీచిన గుండు ఇది ఆయన స్వరూపం. తమిళ డబ్బింగ్ పాత సినిమాలు చూసిన వారు ఈయనను సులభంగా గుర్తుపట్టే చాన్స్ ఉంది. 1934 అక్టోబర్ 5వ తేదిన చో రామస్వామి జన్మించారు. ఈయనకు తమిళనాడులో ప్రత్యేక గుర్తింపు ఉంది.
తుగ్లక్ అనే పత్రిక స్థాపించడంతో పాటు దాని సంపాదకుడిగానే ఎక్కువ ప్రసిద్ది చెందారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరును రాజకీయ వ్యంగ్యాస్త్రంగానే ఉపయోగించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుకు చో రామస్వామికి చాల లింక్ ఉంది.
ఇందిరాగాంధీ మీద విమర్శల కోసం రాసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ నాటకాన్ని మొదటి సారి 1968లో ప్రదర్శించారు. తరువాత దాదాపుగా రెండు వేలసార్లు ఆయన ఆ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం బాగా విజయవంతం అయ్యింది
ఆ నాటకం ఒక బ్రాండ్ గా తమిళనాడులో స్థిరపడిపోయింది. అంతే1970లో చో రామస్వామి తుగ్లక్ అనే ప్రతికను స్థాపించారు. ఈ పత్రిక ముఖ చిత్రం మీద ఎప్పుడూ రాజకీయ కార్టూన్లే దర్శనం ఇస్తాయి.
చో రామస్వామి 37 సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. 58 సినిమాల్లో నటించారు. 12 నాటకాలు రాశారు. ఆయన మాటలు తూటాల్లా సూటిగా ఉంటాయి. జయలలితను నిశితంగా విమర్శించే చో రామస్వామి ఆమెకు మంచి సలహాదారుడు.
జయలలిత చాల మొండి అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె ఎవ్వరిమాట వినరు, ఎవరి సలహాలు తీసుకోరు. అయతే కేవలం ఒక్క చో రామస్వామి దగ్గరే సలహాలు, సూచనలు తీసుకుంటారు. జయలలిత కంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తి అని చో రామస్వామి అభిప్రాయం.
జయలలిత అవినీతిని కూడా చో రామస్వామి చాల ఎండగట్టారు. అయినా ఆయన అంటే జయలలితకు చాల అభిమానం. ఆయన మాట అంటే చాల గౌరవం. అందుకు కారణం చో రామస్వామి నిజాలు మాట్లాడటం. ఉన్నది ఉన్నట్లుగా కుండల బద్దలు కోట్టి చెప్పడం ఆయన అలవాటు.
అందుకు చో రామస్వామి మీద జయలలితకు చాల నమ్మకం. 2015లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చో రామస్వామిని జయలలిత స్వయంగా కలిశారు. మీరు త్వరగా కోలుకుని రావాలని, మీ సలహాలు మాకు కావాలని ఆమె చెప్పారు.
చో రామస్వామి బాగుండాలని జయలలిత ప్రత్యేక పూజలుకూడా చేయిచారు. ప్రముఖ సినీనటి రమ్యకృష్ణకు స్వయాన పెద్దనాన్న అయిన చో రామస్వామి రాజకీయాల్లో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పడం చాలకష్టం.
అయితే ఎవిరిని విమర్శిస్తారో మాత్రం అందరూ చెప్పేస్తారు. కమ్యూనిస్టులను ఈయన గట్టిగా వ్యతిరేకిస్తారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారు. తుగ్లక్ పత్రికతో ఈ విషాయాల్లో ఆయన గట్టిగానే పోరాటం చేశారు. జయలలితకు సన్నిహితుడైన చో రామస్వామి అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమ్మ మరణించిన మూడోరోజే కన్నుమూశారు.