తలచుకుంటే గోధ్రా తరహా అల్లర్లు: మెజారిటీ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: కర్ణాటక మంత్రి..!
బెంగళూరు: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా పలు కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రేగిన దుమారం ఇంకా తగ్గకముందే- అదే పార్టీకి చెందిన కర్ణాటక మంత్రి మరో అడుగు ముందుకేశారు. ఇంకాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గోధ్రా తరహా అల్లర్లు..
మెజారిటీ ప్రజలు తలచుకుంటే గోధ్రా తరహా అల్లర్లు ఏర్పడతాయని హెచ్చరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వివరణ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. మత కల్లోలాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు.
గోధ్రా తరువాత ఏం జరిగిందో మరిచిపోయారా?
గోధ్రాలో రైలును తగులబెట్టిన వెంటనే ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మరిచిపోయారా? అని సీటీ రవి హెచ్చరించారు. చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందనేది వారు (ఓ వర్గం ప్రజలు) ఇప్పటికే చవి చూశారని అన్నారు. నిరసన ప్రదర్శనల్లో భాగంగా ఆందోళనకారులు ఎక్కడిక్కడ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని, తగులబెడుతున్నారని చెప్పారు. మనదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు కూడా తమ సహనాన్ని కోల్పోతే ఏమవుతుందని ప్రశ్నించారు.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి..
మెజారిటీ ప్రజలు సహనాన్ని కోల్పోతే ఎలా ఉంటుందనే విషయం గోధ్రా తరువాతి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్న వారు ఒక్కసారి వెనక్కి తిరిగి చరిత్రను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మెజారిటీ ప్రజలు సహనంతో ఉన్నారంటే అది వారి బలహీనత కాదని, దాన్ని బలహీనతగా భావించ కూడదని సీటీ రవి అన్నారు. మెజారటీ ప్రజల బలమెంతనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.
కాంగ్రెస్ హస్తం..
ఆ మంత్రి- సీటీ రవి. కర్ణాటక మంత్రివర్గంలో పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కర్ణాటక రాజధాని బెంగళూరు సహా మంగళూరు, కలబురగి, విజయపుర, బెళగావి వంటి జిల్లాల్లో ఏర్పడిన హింసాత్మక పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ఈ నిరసనలు, వ్యతిరేక ప్రదర్శనల వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. వారే వెనుక ఉండి దీన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
కర్ణాటకలో అమలు చేస్తాం..
ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ. కర్ణాటకలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతామని సీటీ రవి స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి యడియూరప్ప ఇదివరకే ఓ స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని మెజారిటీ ప్రజలు స్వాగతిస్తున్నారని, కొందరు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.