నడిరోడ్డుపై అగ్నికీలల్లో చిక్కుకున్న సిటీ బస్సు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. బుధవారం మధ్యాహ్నం ఓ సిటీ బస్సు నడి రోడ్డు మీద అగ్నిప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. ఆ సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముంబై మాతుంగ ప్రాంతంలోని మహేశ్వరి ఉద్యాన్ వద్ద నడిరోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబై ములుంద్ నుంచి వర్లీకి బయలుదేరిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ (బెస్ట్)కు చెందిన సిటీ బస్సు మహేశ్వరి ఉద్యాన్ ప్రాంతానికి చేరుకున్న వెంటనే.. నడిరోడ్డు మీద నిలిచిపోయింది. ఇంజిన్ స్టార్ట్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. అదే సమయంలో బస్సు ఇంజిన్, డాష్ బోర్డులో నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీనితో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్, కండక్టర్ సహా ప్రయాణికులందరూ బస్సు నుంచి కిందికి దిగారు. దూరంగా పరుగెత్తారు.
చూస్తుండగానే బస్సు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. సీట్లు అంటుకోవడంతో శరవేగంగా మంటలు వ్యాప్తి చెందాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బస్సు మొత్తం తగులబడిపోయింది. కాలి బూడిదైంది.
దళిత ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై జనసేన పార్టీ వివక్ష చూపుతోందా?
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది. డాష్ బోర్డులోని వైర్లు షార్ట్ సర్క్యూట్ కు గురై ఉండటమో లేక, డీజిల్ ట్యాంకు లీక్ కావడమో వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై బెస్ట్ ఛైర్మన్ అనిల్ పాటంకర్ దర్యాప్తునకు ఆదేశించారు. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో ఎవ్వరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.