జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు
ఆయనేమో అంతా పారదర్శకంగా ఉండాలంటారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్(సీజేఐ) కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులన్నింటినీ త్వరితగతిన విచారించడం లాంటి సంచలన తీర్పులెన్నో చెప్పారు. ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు చేపట్టిన ఆయకే నకిలీ రాయుళ్లు షాకిచ్చారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేరుతో ఫేక్ ప్రకటనలు చేశారు. ఈ వ్యవహారంపై సీజేఐ సీరియస్ గా స్పందించారు. మరోవైపు కొవిడ్ విలయం నేపథ్యంలో సుప్రీంకోర్టు పనితీరుకు సంబంధించి జస్టిస్ రమణ కీలక అంశాలను పరిశీలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు
రమణ పేరుతో మోదీకి బాకా..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఆదివారం సెలవురోజు కావడం, అదే రోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ మోహన్ శంతను గౌడర్ క్యాన్సర్తో కన్నుమూయడంతో సంతాప సూచనగా సోమవారం సుప్రీంకోర్టులో రెండు నిమిషాలు మౌనం పాటించి, కేసుల విచారణను రద్దు చేశారు. కొవిడ్ సంబంధిత పిటిషన్లతోపాటు ఇతర కేసులపై మంగళవారం విచారణ చేపట్టనున్నారు. ఈలోపే సీజేఐ రమణ పేరుతో ఓ ట్విటర్ పోస్టు వ్యాప్తిలోకి వచ్చింది. కరోనా విలయంలో మోదీ సర్కార్ పనితీరు బాగుందని, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికాతో నెరపిన దౌత్యం కారణంగానే ఇండియాకు వ్యాక్సిన్లు వస్తున్నాయంటూ సదరు పోస్టులో రాసుంది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్ గా తీసుకున్నారు.
పోలీసులకు సీజేఐ ఫిర్యాదు..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ( NVRamana) పేరుతో కొనసాగుతోన్న ట్విటర్ అకౌంట్ నకిలీదని, తన పేరుతో అకౌంట్ సృష్టించడమే కాకుండా అనూహ్య పోస్టులు చేస్తోన్న సదరు ఫేక్ రాయుళ్లను గుర్తించి, చర్యలు తీసుకోవాల్సిందిగా సీజేఐ రమణ సోమవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జస్టిస్ రమణ పేరుతో నడుస్తోన్న ఆ ఫేక్ ట్విటర్ అకౌంట్ నుంచి ఇప్పటివరకు 98 పోస్టులు వెలువడ్డాయి. దానిని 5,859 మంది ఫాలో అవుతున్నారు. నిజానికి తనకు ట్విటర్ లోగానీ, ఏ ఇతర సోషల్ మీడియాలోగానీ అధికారిక అకౌంట్లు లేవని సీజేఐ రమణ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే
ముందస్తు సెలవులు, కొవిడ్ సెంటర్
కరోనా రెండో వేవ్ పీక్ దశలో ఉండగా సీజేఐ పదవిని చేపట్టిన జస్టిస్ రమణ.. వైరస్ ఉధృతిపై ఆందోళన వ్యక్తం చేయడం, జడ్జిలు,లాయర్ల మరణాల వల్ల కోర్టులు ప్రభావితం అవుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా ఉంటేనే మహమ్మారిని ఓడించగలమని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు వేసవి సెలవులను ముందస్తుగానే ప్రకటించాలని, ఢిల్లీ చాణక్యపురిలోని న్యూ లాయర్స్ బిల్డింగ్ ను ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చేయాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీజేఐ రమణను విన్నవించారు. ముందస్తు సెలవులు, కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు జస్టిస్ రమణ అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడితే.. మే 8 నుంచి జూన్ 27 వరకు వేసవి సెలవులు ఉంటాయి. తిరిగి జూన్ 28న సుప్రీంకోర్టు రీఓపెన్ అవుతుంది. అప్పటిదాకా అత్యవసర కేసులను, అది కూడా ఆన్ లైన్ ద్వారా మాత్రమే విచారిస్తారు.
Recommended Video