జగన్ సర్కార్ పై సీజేఐ రమణ పరోక్ష వ్యాఖ్యలు ? ధిక్కార కేసులు అందుకే జడ్డీలు, సీఎంల సదస్సులో
ఏపిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైకోర్టుతో గ్యాప్ పెరిగింది. హైకోర్టు తమ నిర్ణయాల్ని పదే పదే తప్పుబడుతుందన్న కారణంతో వైసీపీ సర్కార్ గతంలో జడ్డీల్ని టార్గెట్ చేసింది. అదే సమయంలో తమ తీర్పుల్ని అమలు చేయని అధికారులపై హైకోర్టు ధిక్కార కేసుల్లో విచారణ జరుపుతోంది. ఇదే అంశాన్ని ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న సీఎంలు, న్యాయమూర్తుల సదస్సులో సీజేఐ ఎన్వీ రమణ పరోక్షంగా ప్రస్తావించారు.
ఢిల్లీలో సీఎంలు, జడ్డీల సదస్సు
ఢిల్లీలోని విజ్ఠాన్ భవన్ లో ఇవాళ సీఎంలు, హైకోర్టు జడ్డీల సదస్సు ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చిస్తున్నారు. వీటిలో న్యాయస్థానాలలో ఐటీ నెట్వర్క్ బలోపేతం , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యాయస్థానాల ఉత్తర్వుల చేరవేత, జిల్లా కోర్టులో శాశ్వత క్యాడర్ నియామకం, జిల్లా కోర్టుల బలోపేతం కోసం సమర్థవంతమైన మానవ వనరుల నియామకం, కేంద్ర , రాష్ట్ర యంత్రాంగం ద్వారా జిల్లా కోర్టుల మౌలిక వసతుల బలోపేతం, నైపుణ్యాల అభివృద్ధి, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు-మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి ప్రోత్సాహం, హైకోర్టు జడ్జి ల నియామక ప్రక్రియ , సిఫారసుల అమలు వేగవంతం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.
సీజేఐ రమణ కీలక ప్రసంగం
న్యాయమూర్తులు తమ విధి నిర్వహణ సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు సహా ప్రధాని మోదీ హాజరైన సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో తమ పరిమితులను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
లక్ష్మణ రేఖను దాటొద్దని సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందని గుర్తుచేసిన సీజేఐ... ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోయాయని ఆవేదనతో చెప్పారు.
జగన్ సర్కార్ పై పరోక్ష వ్యాఖ్యలు
సీఎంలు, జడ్డీల సదస్సులో సీజేఐ రమణ ప్రభుత్వాల తీరుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు కోర్టుల ఆదేశాల్ని అమలు చేయకపోవడంతో దేశంలో ధిక్కార కేసుల సంఖ్య పెరుగుతోందని రమణ ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా ప్రభుత్వాలు సహకరిస్తే ధిక్కార కేసుల సంఖ్య తగ్గుతుందని సూచించారు.
ప్రభుత్వాలు, కోర్టులు కలిసి చట్టాల్ని అమలు చేయాల్సి ఉంటుందని ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వం కోర్టుల తీర్పుల్ని అమరావతి సహా పలు విషయాల్లో అమలు చేయడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ధిక్కార చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీజేఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.