కేజ్రీ దెబ్బతో బీజేపీ కొత్తపాట: మోడీ వ్యతిరేకులంతా ఒక్కటై, మమత పంచ్
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్నాయి. ఈ రోజు (గురువారం) సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఢిల్లీ ఎన్నికల ప్రీ పోల్ సర్వేలు ఆసక్తిని, ఉత్కంఠను రేపాయి. తొలుత బీజేపీదే ఢిల్లీ పీఠమని, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీదని, మళ్లీ.. బీజేపీనే విజయం వరిస్తుందని చెప్పాయి. చివరి నిమిషంలో కొన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందంటే, మరికొన్ని సర్వేలు ఏఏపీ గెలుస్తుందని చెబుతున్నాయి.
బీజేపీ కొత్త పాట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ కొత్త పాట అందుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ ఎన్నికల వరకు ఆ పార్టీ మోడీ వేవ్ అంటూ ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల విషయంలో మాత్రం మోడీ పాలనకు ఇవి రిఫరెండం కాదని చెబుతున్నాయి. తద్వారా ఆ పార్టీ తన ఓటమిని ముందే ఒప్పుకున్నట్లుగా అయిందని ఏఏపీ, కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కిరణ్ బేడీ రాకనే ముంచిందా?
సార్వత్రిక ఎన్నికల నుండి బీజేపీ మోడీ వేవ్ పైనే గెలుస్తూ వచ్చింది. అయితే, ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొద్ది రోజులుగా మోడీ పేరు పక్కకు పోయి కిరణ్ బేడీ ప్రచారంలో బాగా వినిపిస్తోంది. ఇదే ఆ పార్టీకి మైనస్గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కిరణ్ బేడీ చేరక పోయి ఉంటే మోడీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే వారని, తద్వారా బీజేపీ వైపే సర్వేలు మొగ్గు చూపేవని అంటున్నారు.

సీన్లో లేని కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఏపీల మధ్యనే పోటా పోటీ నెలకొంది. ప్రచారం కూడా ఆ రెండు పార్టీల మధ్యనే వేడిగా వాడిగా సాగింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కొంత దూకుడు కనిపించినప్పటికీ, రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినప్పటికీ అధికార రేసులో ఆ పార్టీ ఏమాత్రం లేదు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మేజిక్ ఫిగర్ 36. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 3 నుండి ఏడు సీట్లు మాత్రమే గెలుచుకోగలదని సర్వేలు చెబుతున్నాయి.
కేజ్రీవాల్ వర్సెస్ కిరణ్ బేడీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడిగా వేడిగా సాగింది. కిరణ్ బేడీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన తర్వాత వేడి క్రమంగా పెరిగింది. తొలుత ఏఏపీ ఆచితూచి మాట్లాడింది. అనంతరం తన మాటల దాడిని ప్రదర్శించింది. కిరణ్ బేడీ మొదటి నుండి కేజ్రీవాల్ పైన విరుచుకు పడ్డారు. కేజ్రీవాల్ వర్సెస్ బేడీలుగా ఉండటంతో ప్రధాని మోడీ పేరు ఈ ఎన్నికల్లో అంతగా వినిపించలేదనే చెప్పవచ్చు. బీజేపీ గెలిచినా ఓడినా అందులో మోడీ పాత్ర ఉంటుందని అంటున్నారు.
మోడీ వ్యతిరేకులు ఒక్కటయ్యారా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని వ్యతిరేకించే వారంతా ఒక్కటయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటారు. ఇది ఆసక్తికరంగా మారింది. ఇందువల్లే వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీకి చివరి నిమిషంలో తన మద్దతు ప్రకటించారు. ఏఏపీకి ఓటు వేయాలని ఆమె ఢిల్లీలోని ఓటర్లను కోరారు. వామపక్షాలు ఇప్పటికే ఏఏపీకి మద్దతిస్తున్నాయి. ఇక వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా ఏఏపీకే మద్దతిస్తున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా పోటీలో నిలిచి.. అధికారం రేసులో లేని కాంగ్రెస్ పార్టీ తాము ఓడిపోతామని భావించిన చోట ఏఏపీకి అంతర్గంతగా మద్దతిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ గెలవవద్దని కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, జేడీయు... ఇలా ఎన్నో పార్టీలు కోరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో తాము కచ్చితంగా గెలవలేమనే నియోజకవర్గాల్లో అంతర్గంతంగా ఏఏపీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని అంటున్నారు. మొత్తంగా ఢిల్లీలో మోడీని వ్యతిరేకించే వారంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక్కటవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు మమతా బెనర్జీ, వామపక్షాలు ఏఏపీకి మద్దతు పలకడమే నిదర్శనమని చెబుతున్నారు.
రేసులోకి దూసుకొచ్చిన ఏఏపీ!
తొలుత సర్వేల్లో బీజేపీదే అధికారమని, ఏఏపీ 29 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుందని సర్వేలు చెప్పాయి. కానీ, కిరణ్ బేడీ బీజేపీలో చేరిక, పలు పార్టీల మద్దతుతో ఏఏపీ అనూహ్యంగా బీజేపీతో పాటు రేసులోకి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు బీజేపీది అధికారమని కొన్ని సర్వేలు, ఏఏపీది అధికారమని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి.
ప్రీపోల్ సర్వే: ఏ సర్వే ఏం చెబుతోంది?
ఆజ్ తక్ - సిసిరో సర్వే - బీజేపీ: 19-25 ఏఏపీ: 38-46 కాంగ్రెస్: 0-2
ది వీక్-ఐఎంఆర్బీ సర్వే - బీజేపీ: 36 ఏఏపీ: 29 కాంగ్రెస్: 0-2
ఏబీపీ-నీల్సన్ సర్వే - బీజేపీ: 29 ఏఏపీ: 35 కాంగ్రెస్: 6
జీ-తాలిమ్ సర్వే - బీజేపీ: 32 ఏఏపీ: 34 కాంగ్రెస్: 4
ఇండియా టీవీ - సీ ఓవటరు సర్వే - బీజేపీ: 37 ఏఏపీ: 28 కాంగ్రెస్: 5
హెచ్టీ-సీ ఫోర్ సర్వే - బీజేపీ: 27-32 ఏఏపీ: 36-41 కాంగ్రెస్: 2-7
ఐబీఎన్7 - డాటా మినెరల్ సర్వే - బీజేపీ: 36 ఏఏపీ: 27 కాంగ్రెస్: 7
న్యూస్ నేషన్ సర్వే - బీజేపీ: 31-35 ఏఏపీ: 30-34 కాంగ్రెస్: 3-5












Click it and Unblock the Notifications