‘‘ఈవీఎం అంటే.. ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ, చట్టాలపై గౌరవం లేనివాళ్లు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవాలి’’
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం అంటే.. ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ అంటూ కొత్త భాష్యం చెప్పారు. అంతేకాదు - చట్టాలపై గౌరవం లేనివాళ్లు, రౌడీలు, గూండాలు రాష్ట్రాన్ని విడిచి
లక్నో: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచీ కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్న యోగి ఆధిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో గోరఖ్పూర్ లో శనివారం సమావేశమైన సందర్భంగా యోగి మాట్లాడుతూ.. 'ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ' అని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయగా, తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ మోజార్టీతో విజయం సాధించడంపై యోగి స్పందిస్తూ.. ఢిల్లీ ప్రజలు తమ పార్టీ బీజేపీపై నమ్మకం ఉంచారని, అందుకే 'ఈవీఎం.. ఎవ్రీ ఓట్ మోడీ' విధానాన్ని అనుసరించారని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ దేశంలో వీఐపీల సంప్రదాయానికి అడ్డుకట్ట వేశారని కొనియాడారు. చట్టాలపై గౌరవం లేనివాళ్లు, రౌడీలు, గూండాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవాలని.. వారి మంచికోసమే తాను చెబుతున్నాననంటూ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆఫీసు వేళల్లో తాను ఏ సమయంలో ఫోన్ చేసినా అధికారులు కచ్చితంగా స్పందించాలని.. లేని పక్షంలో వేటు వేస్తానని ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలు, ప్రభుత్వ విధానాలపై తనకు స్పష్టమైన విజన్ ఉందని, భవిష్యత్తులోనూ ఎన్నో మార్పులకు శ్రీకారం చుడతానని గోరఖ్పూర్ సభలోనూ యోగి పేర్కొన్నారు.