కేజ్రీవాల్ కరెంట్ బిల్లు రూ.1.35 లక్షలు, 30 ఏసీలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటి విద్యుత్ బిల్లు జూన్ నెలకు అక్షరాలా రూ.1.35 లక్షలు వచ్చింది. ఆయన ఇంట్లో 30 ఏసీలు ఉన్నాయి. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో నెంబర్ 6 ఆయన అధికారిక నివాసం.
ఆయన నివాసంలో రెండు మీటర్లు ఉన్నాయి. ఆ ప్రాంగణంలో ఆయన అధికారిక నివాసం, సమావేశాల కోసం అధికారిక కార్యాలయాలు ఉన్నాయి. అయితే రెండు మీటర్లు కలిపి జూన్ నెలకు రూ.1.35 లక్షల బిల్లు వచ్చింది.
ప్రభుత్వ పనుల కోసం వినియోగించిన విద్యుత్, నివాసంలో వినియోగించిన విద్యుత్ (ప్రయివేటు) ఎంత అనే అంశం పైన స్పష్టత లేదు. అలాగే 30 ఏసీలలో ఆయన ఇంట్లో ఎన్ని ఉన్నాయి, కార్యాలయంలో ఎన్ని ఉన్నాయనే విషయం కూడా తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ మీటరును కమర్షియల్ మీటరుగా పరిగణించాలని ఢిల్లీ టాటా పవర్స్ కేజ్రీవాల్ నివాసానికి నోటీసులు పంపించాలనే యోచనలో ఉంది. కాగా, అంతకుముందు రెండు నెలల కరెంటు బిల్లు దాదాపు లక్ష వచ్చింది.
దీంతోనే ఢిల్లీ ప్రజలు షాకయ్యారు. ఇప్పుడు ఏకంగా నెలకు రూ.1.35 లక్షల బిల్లు రావడం గమనార్హం. ఇంతగా విద్యుత్ వినియోగిస్తున్న అక్కడ ఎంతమంది ఉంటారో తెలియదని తెలుస్తోంది. ఇంత బిల్లు రావడం ఏఏపీకి తలనొప్పి తీసుకు వస్తోంది.
ఉత్తర కొరియా నియంతతో పోల్చిన కాంగ్రెస్
కేజ్రీవాల్ సర్కారు ప్రచార కార్యక్రమాల కోసం రూ.526 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ దీనిపై మండిపడ్డారు. కేజ్రీవాల్ను ఉత్తర కొరియా నియంతను తలపిస్తున్నారన్నారు. సొంత డబ్బా కోసం ఇన్ని నిధులా అన్నారు.