రాష్ట్రపతి అభ్యర్థి: యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు, శరద్ పవార్ వెల్లడి
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వం ఖరారయ్యింది. దీంతో ప్రతిపక్షాల బలం.. ఏ పార్టీ మద్దతు ఇస్తుందనే అంశం చర్చకు దారితీసింది. బీజేపీకి సరిపడ బలం ఉంది. కానీ వైసీపీ మద్దతు అవసరం ఉంటుంది. విపక్షాలకు మాత్రం.. కొత్తగా ఏ పార్టీ వచ్చి సపోర్ట్ చేసినా ఓకే అనే పరిస్థితి.. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినట్టు సమాచారం.
విపక్షాల తరపున పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఇంట్రెస్ట్ చూపించారు. ముందునుంచీ మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ విషయం వెల్లడించారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి సంబంధించి కేసీఆర్తో రెండుసార్లు ఫోన్లో మాట్లాడానని ఆయన వివరించారు. యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా ఓటు వేయనున్నారు. ఒక పార్టీ సపోర్ట్ చేయడంతో.. విపక్షాలకు మద్దతు పెరిగినట్టు అయ్యింది. అంతకుముందు విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం మల్లగుల్లాలు పడ్డాయి. ముందు శరద్ పవార్ నిరాకరించారు. తర్వాత ఫరూక్ అబ్దుల్లా పోటీ చేయబోనని తెలిపారు. గాంధీ మనమడు గోపాలకృష్ణ గాంధీ కూడా నో చెప్పారు. ఇవాళ మాత్రం యశ్వంత్ సిన్హా అంగీకారం తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈ నెల 15న జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ను జులై 18న నిర్వహిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.