యూపీ ఎన్నికల తెర మీదికి రామమందిరం: అధికారంలోకి వస్తే ఆ పనిచేస్తామంటూ యోగి కీలక ప్రకటన
లక్నో: ఊహించినట్టే- ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రామమందిరం కీలక పాత్ర పోషించబోతోంది. అయోధ్యలో నిర్మితమౌతోన్న రామ మందిరాన్ని మళ్లీ తెర మీదికి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ ఆలయాన్ని ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చింది. అయోధ్య రామాలయంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని జాతీయ మందిరంగా గుర్తించేలా చర్యలు తీసుకుంటామని, దీనికోసం కేంద్రాన్ని ఒప్పిస్తామని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కర్హాల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ స్థానం నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. ఆయన విజయావకాశాలను గండి కొట్టాలనే లక్ష్యంతో యోగి ఆదిత్యనాథ్- కర్హాల్ స్థానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారని, రామాలయాన్ని తెరమీదికి తీసుకొచ్చారని అంటున్నారు.
కర్హాల్ స్థానం సమాజ్వాది పార్టీకి కంచుకోట. మూడు దఫాలుగా ఈ నియోజకవర్గంపై తన జెండాను ఎగురవేసింది ఎస్పీ. 2007, 2012, 2017 ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. 2017లో బీజేపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని గెలుపొందారు. ఈ నియోజకవర్గం పరిధిలో యాదవుల ఓటుబ్యాంకు భారీగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అనేది విశ్లేషకుల అంచనా. అఖిలేష్ యాదవ్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికీ ఇదీ ఓ కారణమైంది.
దీన్ని దృష్టిలో ఉంచుకునే అఖిలేష్ యాదవ్ కంచుకోటలో యోగి ఆదిత్యనాథ్ తన బలాన్ని నిరూపించుకునేలా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. తమ ఓటమిని సమాజ్వాది పార్టీ నాయకులు ముందే గ్రహించారని, అందుకే తీవ్ర అసహనంతో ఉన్నారని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి సింగ్ బఘేల్పై దాడికి దిగడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. సింగ్ బఘేల్పై దాడిని ఆయన పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
తమ పార్టీ సీనియర్ నాయకుడు శివ్పాల్ను కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వకుండా సమాజ్వాది అవమానించిందని మండిపడ్డారు. ఆయనను చూస్తే జాలేస్తోందని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. 350 స్థానాలకు తగ్గకుండా విజయాన్ని సాధించబోతోన్నామని, మార్చి 10వ తేదీ తరువాత రాష్ట్రంలో ఊహించని సమీకరణాలు ఉండబోతోన్నాయని అన్నారు. 2023 నాటికి రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీన్ని జాతీయ మందిరంగా గుర్తిస్తామని యోగి స్పష్టం చేశారు.