కరోనా: కేంద్ర-రాష్ట్రాల డిష్యుం డిష్యుం.. లాక్డౌన్పై నిర్ణయాధికారం కావాలన్న సీఎంలు..మోదీపై ఫైర్
లాక్ డౌన్ విధించి 50 రోజులు కావస్తున్నా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కట్టడికాలేదు. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కొత్తగా 4,213 మందికి వైరస్ సోకింది. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 70వేలకు చేరువైంది. కొత్త కేసులు వెల్లువలా వస్తుండటంతో రికవరీ రేటు గరిష్టంగా ఆనందం కూడా ఆవిరైపోయింది. అదీగాక, మన దేశంలో వైరస్ వ్యాప్తి మే మధ్యలోగానీ, జూన్ ప్రారంభంలోగానీ ఇంకా పీక్ దశకు చేరుతుందని రిపోర్టులు వచ్చాయి. అప్పటిదాకా అన్నీ మూసుకుని కూర్చుకుంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు ఈనెల 17తో ముగియనుంది. ఇన్ని అంశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హాట్ హాట్ గా సాగింది.

మోదీ వారించినా..
గత సమావేశానికి భిన్నంగా ఈసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించడంతో ప్రధాని కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా సాగింది. ప్రారంభ, ముగింపు ఉపన్యాసాల్లో మోదీ.. రాష్ట్రాలపై ప్రశంసలు కురిపించారు. సీఎంలు అందించే సూచనల ఆధారంగానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్థిక కలాపాలు పున:ప్రారంభం కావాల్సిందేనని, అందు కోసం భారీగా సడలింపులు కూడా ప్రకటిస్తామని, జోన్ల నిర్ధారణ ఇకపై రాష్ట్రాలకే వదిలేస్తామని తెలిపారు. అయితే.. మోదీ చెప్పినమాటలకు చేపట్టిన పనులకు పొంతనేలేదని ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు.

సీఎంలు సీరియస్..
లాక్ డౌన్ ఎత్తివేత లేదా ఎగ్జిట్ తప్పదని పదే పదే స్ట్రెస్ చేసిన ప్రధాని.. ఆ ప్రక్రియలో భాగంగా సడలింపులు కల్పిస్తామని, ఇప్పటికే రైలు రవాణాను కూడా ప్రారంభించామని చెప్పుకొచ్చారు. అనూహ్యంగా చాలా మంది సీఎంలు ప్రధాని తీరును తప్పుపట్టారు. కరోనా లాక్ డౌన్ విషయంలో కేంద్రం పెత్తనాన్ని బాహాటంగా నిరసించారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేయాలి, ఏ ప్రాంతానికి లేదా ఏ రంగానికి మినహాయింపులు కల్పించాలని అనే నిర్ణయాధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని ముఖ్యమంత్రులు పట్టుపట్టారు. కొందరు సీఎంలైతే.. తమను సంప్రదించకుండా రైళ్లను ప్రారంభించడంపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవసరమనుకుంటే ఆయా రైళ్లను తమ రాష్ట్రాల గుండా వెళ్లబోనివ్వమని కూడా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

అవగాహన మాకే ఎక్కువ..
ఢిల్లీలో కూర్చొని ఫలానా జిల్లాను రెడ్ జోన్ లేదా మరో జోన్ గా నిర్ధారించడం, ఏయే వ్యాపారాలు చేసుకోవచ్చో, ఏరంగానికి సంబంధించిన ఫ్యాక్టరీలు రీ ఓపెన్ చేయొచ్చో నిర్ణయించడం సబబు కాదని, ఎక్కడికక్కడే భిన్న పరిస్థితులు, వాతావరణం, పండే పంటలు, అవసరాల ఆధారంగా లాక్ డౌన్ గౌడ్ లైన్స్ లో సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలని మెజార్టీ సీఎంలు అభిప్రాయపడ్డారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే మరో అడుగు ముందుకేసి ప్రధానిపై విమర్శలు కూడా గుప్పంచారు. టీమిండియా అంటే అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఇవ్వాలేగానీ, కేంద్రం ఎలా చెబితే అలా వినాలనడం సరికాదని, ప్రతి రాష్ట్రానికి తనవైన ప్రత్యేక సమస్యలు ఉంటాయి కాబట్టి లాక్ డౌన్ సంబంధిత నిర్ణయాలు సీఎంలకే వదిలిపెట్టాలని అన్నారు. ఈలోపు..

లాక్డౌన్ పొడగించాల్సిందే..
దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తేసే దిశగా మరిన్ని సడలింపులకు కేంద్ర సిద్ధపడగా.. మెజార్టీ రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ పొడగింపునకే మొగ్గు చూపడం గమనార్హం. కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో మే 17 నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభించడం దాదాపు అసాధ్యమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధానికి తెలిపారు. విచ్చలవిడిగా సడలింపులు ఇవ్వడం వల్లే చైనాలో కేసులు మళ్లీ తిరగబెట్టాయని ఆయన గుర్తుచేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం మే చివరిదాకా లాక్ డౌన్ ఉండాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదివరకే మే 29 వరకు పొడిగించారు. పంజాబ్, ఒడిశా, కేరళ, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు సైతం పొడగింపువైపే మొగ్గుచూపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మాత్రం.. కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
Recommended Video

బుధవారం తుది నిర్ణయం?
ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లో వెల్లడైన అభిప్రాయాలను క్రోడీకరించనున్న ప్రధాని మోదీ.. అంశాల సాధ్యాసాధ్యాలపై వైద్య, ఆర్థిక, ఇతర రంగాలకు చెందిన నిపుణులతో మాట్లాడుతారని తెలుస్తోంది. బుధవారం జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలోనూ ఇదే అంశాన్ని ప్రధాన అజెండాగా చర్చించి, లాక్ డౌన్ పై తుది నిర్ణయాన్ని అదే రోజు ప్రకటించే వీలుందని కేంద్ర వర్గాలు తెలిపారు. అదే సమయంలో మరో భారీ ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రం ప్రకటించబోతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications