ఎన్నికల్లో కాక్రోచ్ పార్టీ పోటీ? అభిజీత్ దీప్కే మైండ్ బ్లోయింగ్ ఆన్సర్
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 'నీట్-యూజీ' (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వివాదంపై దేశ యువతకు భరోసా ఇవ్వడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందంటూ సరికొత్తగా ఆవిర్భవించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) మంగళవారం నాగ్పూర్లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
తొలుత సెటైరికల్ ఆలోచనలతో మొదలై, ప్రస్తుతం ఒక రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందిన ఈ పార్టీ ఆధ్వర్యంలో సంవిధాన్ స్క్వేర్ వద్ద వందలాది మంది విద్యార్థులు, యువకులు కాక్రోచ్ (బొద్దింక) మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. నీట్ పరీక్షల రీ-ఎగ్జామ్కు కొన్ని రోజుల ముందే జరిగిన ఈ ఆందోళనలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో పోటీపై..
ఈ నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త అభిజీత్ దీప్కే మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అని మీడియా ప్రశ్నించగా.. ఆయన ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. "మేం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక హక్కుల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే అసలు వ్యవస్థ ఎలా నడుస్తుంది?" అని దీప్కే ఎదురు ప్రశ్నించారు. కేవలం హక్కుల కోసం పౌరులను ఎన్నికల బరిలోకి నెట్టడం సబబు కాదన్నారు.
ప్రధాని మోదీ 'పరీక్షా పే చర్చ'పై విమర్శలు
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరును అభిజీత్ దీప్కే తీవ్రంగా తప్పుపట్టారు. నీట్ అక్రమాలు, పరీక్షల రద్దు నేపథ్యంలో మనస్తాపానికి గురై దేశంలో ఐదారుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ కుటుంబాలకు ప్రధాని ముందుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
"ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ట్వీట్ చేసే ప్రధానమంత్రి గారు.. మన దేశంలో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కనీసం ఒక సంతాప ట్వీట్ కూడా చేయకపోవడం విచారకరం. మీరు ఇంకెంత కాలం మీ 'మన్ కీ బాత్', 'పరీక్షా పే చర్చ'ల గురించి మాట్లాడుతుంటారు? ఇప్పటికైనా విద్యార్థుల మనసులోని మాటను (మన్ కీ బాత్) వినండి" అని దీప్కే హితవు పలికారు.
ప్రభుత్వమే విద్యార్థులతో క్రమబద్ధంగా చర్చలు జరిపితే వారి సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
ధర్నాలు ప్రజాస్వామ్యానికి జీవనాడి.. ఉద్రిక్తత!
ఈ నిరసనలను పొరుగు దేశాల్లో జరుగుతున్న అల్లర్లతో పోల్చుతూ విమర్శిస్తున్న వారికి దీప్కే గట్టి కౌంటర్ ఇచ్చారు. "భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది పోరాటాల వల్లే. మన దేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నా, మనుగడ సాగిస్తోందన్నా దానికి కారణం నిరసనలు తెలపడమే. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిరసనలు చాలా మంచివి" అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, సంవిధాన్ స్క్వేర్ వద్ద నిరసన జరుగుతున్న సమయంలో.. కాషాయ కండువాలు ధరించిన ఒక బృందం అక్కడికి చేరుకుని "జై శ్రీరామ్" అంటూ నినాదాలు చేసింది. కాక్రోచ్ జంత పార్టీ విద్యార్థులను పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ ఆందోళనకారులను అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.














Click it and Unblock the Notifications