బురఖా ధరించినందుకు కళాశాల నుంచి గెంటివేత: అసాంఘిక శక్తులకు అవకాశం ఇస్తోందట!
లక్నో: ముస్లిం విద్యార్థినులు ఇస్లాం సంప్రదాయబద్ధమైన బురఖా ధరించడాన్ని నిషేధించింది ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం. బురఖా ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు కళాశాల ఆవరణలోకి ప్రవేశించి, అల్లర్లకు పాల్పడుతున్నాయనే కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయినప్పటికీ.. రోజూలాగే బురఖా ధరించి కళాశాలకు వచ్చిన కొందరు ముస్లిం విద్యార్థినుల పట్ల కళాశాల యాజమాన్యం నిర్దయగా ప్రవర్తించింది. తరగతి గదుల నుంచి వారిని వెల్లగొట్టింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లోని ఎస్ఆర్కే కళాశాలలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
హామీ ఇచ్చారు..అమలు చేశారు: ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత..బేషరతుగా!
ఎస్ఆర్కే కళాశాల ఆవరణలో కొద్దిరోజుల కిందట రెండు విద్యార్థి సంఘాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సందర్భంగా కొందరు బయటి వ్యక్తులు, రౌడీ మూకలు బురఖా వేసుకుని కళాశాలలోకి వచ్చి, అల్లర్లకు పాల్పడ్డాయనే ఫిర్యాదులు కళాశాల యాజమాన్యానికి అందాయి. దీనిపై విచారణకు ఆదేశించింది కళాశాల యాజమాన్యం. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ.. బురఖా ధరించి కళాశాల ఆవరణలోకి ప్రవేశించడం వల్ల వారిని గుర్తించలేకపోయినట్లు తేలింది.
ఫలితంగా- బురఖాలను నిషేధించాలని యాజమాన్యం బోర్డు సమావేశంలో తీర్మానించింది. మూడు రోజుల కిందట దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ- ఈ మధ్యాహ్నం కొందరు ముస్లిం విద్యార్థినులు బురఖా వేసుకుని కళాశాలకు వచ్చారు. మొదట్లో ఎవర వారికి అడ్డు చెప్పలేదు. దీనితో ఆ విద్యార్థినులు తరగతి గదులకు వెళ్లారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వారిని గుర్తించిన కళాశాల ప్రిన్సిపల్, యాజమాన్య ప్రతినిధులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. కళాశాల తరగతి గదుల నుంచీ వారిని బయటికి వెల్లగొట్టారు. విద్యార్థినులు బతిమాలుకున్నప్పటికీ.. వినిపించుకోలేదు.
సెక్యూరిటీ సిబ్బందితో ఆవరణ దాటి బయటికి వెళ్లగొట్టారు. ఈ విషయం ఆయా విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఎస్ఆర్కే కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీనితో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల ప్రిన్సిపల్, ఇతర సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. బురఖా ముసులో అసాంఘిక శక్తులు కళాశాల ఆవరణలో ప్రవేశిస్తున్నాయని, వారిని నివారించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది తమకు, తమ కుమార్తెలకు క్షమాపణ చెప్పాలని వారు పట్టుబట్టారు.