అమెరికా రక్షణ కార్యదర్శితో ప్రధాని మోదీ భేటీ... ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చర్చ...
అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(మార్చి 19) భేటీ అయ్యారు. ఆస్టిన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు భారత్లో అడుగుపెట్టారు. ఆస్టిన్-మోదీ మధ్య భేటీలో ద్వైపాక్షిక రక్షణ సహకారం,భద్రతాపరమైన సంబంధాలు,ఇండో-పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్య ధోరణి తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్కు తన తరుపున శుభాకాంక్షలు తెలియజేయాలని ఆస్టిన్తో మోదీ చెప్పినట్లు తెలిపాయి. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్లోనూ వెల్లడించారు.
'తాజా సమావేశంలో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఆస్టిన్ అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఇండో-పసిఫిక్ రీజియన్లో శాంతి,సుస్థిరత,సుసంపన్నతను నెలకొల్పేందుకు ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాల్సిన అవసరంపై చర్చించారు.' అని పీఎంవో వర్గాలు తెలిపాయి.
మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆస్టిన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా సమావేశం కానున్నారు. చైనా, ఆఫ్ఘనిస్తాన్ సహా ముఖ్యమైన ప్రాంతీయ భద్రతా సమస్యలపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్దోవల్తో ఆస్టిన్ చర్చించనున్నారు. 3 బిలియన్ డాలర్లకు పైగా అంచనా వ్యయంతో అమెరికా నుండి సుమారు 30 మల్టీ-మిషన్ సాయుధ ప్రిడేటర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేసే అంశంపై కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది.
ఇటీవలే భారత్,అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్ క్వాడ్ కూటమి సమావేశం ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు ఆసియాలోని మిత్రదేశాలకు సహాయ,సహకారాలు అందించే వ్యూహంతో అమెరికా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆస్టిన్ భారత పర్యటన కొనసాగుతోంది.
Pleasure to meet U.S. @SecDef Lloyd Austin today. Conveyed my best wishes to @POTUS @JoeBiden. India and US are committed to our strategic partnership that is a force for global good. pic.twitter.com/Z1AoGJlzFX
— Narendra Modi (@narendramodi) March 19, 2021