మహా విలయం : కరోనా దెబ్బకు మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ , నేడే ప్రకటన !!
మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. 144 సెక్షన్ విధించినా మహారాష్ట్రలో ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయం లేక సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని మహారాష్ట్ర సర్కార్ సమాయత్తమవుతోంది.
నేడు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించనున్న సీఎం ఉద్ధవ్ థాక్రే
కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మహారాష్ట్ర కేబినెట్ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేసేందుకు మొగ్గుచూపినట్లు గా తెలుస్తోంది . మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలను ఈరోజు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడి చేస్తారని ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ, 144 సెక్షన్ , వారాంతంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ మహారాష్ట్రలో పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రాలేదు.

మహారాష్ట్రలో రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సంక్షోభం
దీంతో కఠినమైన లాక్ డౌన్ అమలు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులతో మహారాష్ట్రలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత, వైద్య సదుపాయాల లేమి మహారాష్ట్ర సర్కార్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలను కాపాడడం కష్టమని భావిస్తున్న మహా ప్రభుత్వం ఎట్టకేలకు సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించనుంది.
మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 62,097 కొత్త కరోనావైరస్ కేసులు
మహారాష్ట్రలో మంగళవారం 62,097 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,60,359 గా ఉంది. మరో 519 మంది రోగులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. కొత్త మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 61,343 కు చేరుకున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి . ముంబైలో 7,192 కొత్త కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి.
ఒక్క పూణేలోనే రోజుకు అంబులెన్స్ ల కోసం 9 వేల కాల్స్
రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరగడంతో, పూణేలోని మహారాష్ట్ర అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్ల కోసం రోజుకు 9,000 కాల్స్ వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . కంట్రోల్ రూమ్ మేనేజర్ డాక్టర్ ప్రవీణ సాధలే కోవిడ్ అత్యవసర పరిస్థితులు మరియు ఇతరులతో సహా రోజుకు 9,000-10,000 కాల్స్ వస్తున్నాయని తెలిపారు . ఇప్పుడు భయం పెరిగింది. మహారాష్ట్ర అంతటా సుమారు 937 అంబులెన్స్లను ఉంచినట్లు మేనేజర్ తెలిపారు.
దారుణంగా దిగజారిపోతున్న పరిస్థితులు .. సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయం
అంబులెన్స్లలో రోగులను తరలించటానికి పిపిఇ కిట్లతో సహా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు . దారుణంగా దిగజారిపోతున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే మహారాష్ట్ర సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తే, దీని ప్రభావం పొరుగు రాష్ట్రాల పై పడుతుందని అంచనా .












Click it and Unblock the Notifications