కోటీశ్వరుల నుంచి బిక్షగత్తె వరకు... ఈసారి లోక్సభలో ఎన్ని విశేషాలో..
ఢిల్లీ : సార్వత్రిక ఫలితాలు వెలువడటంతో త్వరలోనే 17వ లోక్సభ కొలువుదీరనుంది. ఈసారి లోక్సభకు ఎన్నికైన వారికి సంబంధించి అనేక ఆసక్తికర విశేషాలు ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికైన వారి విద్యార్హతలు పెరగగా.. సగటు వయసు తగ్గింది. మహిళా ప్రాతినిధ్యం పెరగడంతో పాటు పలు కొత్త ముఖాలు ఈసారి కనిపించనున్నాయి. భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఎన్నికల అఫిడవిట్లో తన వృత్తిని భిక్షగత్తెగా చెప్పుకోవడం విశేషం.

సగటు వయసు 54
17వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల సగటు వయసు 54.4గా ఉంది. ఈసారి సభలో అడుగుపెట్టనున్న అతి పిన్న వయస్కురాలు ఒడిశాకు చెందిన చంద్రాని ముర్ము కాగా... యూపీ సంబల్కు చెందిన 86ఏళ్ల డాక్టర్ షఫీకర్ రెహ్మాన్ బర్క్ అత్యంత వృద్ధ ఎంపీగా రికార్డు సృష్టించారు.
ఈసారి 30ఏళ్ల లోపు వారు 8మంది సభలో అడుగుపెట్టనుండగా.. 31 నుంచి 40ఏళ్ల మధ్య వయసుగల వారు 57, 41 నుంచి 50 ఏజ్ గ్రూప్లో 129, 51 నుంచి 60 మధ్యలో 170, 60ఏళ్లు పైబడిన ఎంపీలు 177 మంది ఉన్నారు. మగవాళ్లతో పోలిస్తే ఆడ ఎంపీల సగటు వయసు ఆరేళ్లు తక్కువ కావడం విశేషం.

భారీ సంఖ్యలో గ్రాడ్యుయేట్లు
17వ లోక్సభకు ఎన్నికైన 542మంది ఎంపీల్లో 394 మంది డిగ్రీ పూర్తి చేసిన వారే కావడం విశేషం. 12వ తరగతి వరకు పూర్తి చేసిన వారు 27 శాతం కాగా.. 16వ లోక్సభలో వారి శాతం 20గా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దాదాపు 25శాతం కాగా.. డాక్టరేట్ కంప్లీట్ చేసిన వారు 5శాతం మంది ఉన్నారు. 1996 నుంచి ప్రతి లోక్సభలో 75శాతం మంది డిగ్రీ పూర్తి చేసిన వారే ఉంటున్నారు.

వ్యాపారవేత్తల నుంచి బిక్షగత్తె వరకు
లోక్సభకు ఎన్నికైన మొత్తం సభ్యుల్లో 39 శాతం మంది సభ్యులు తమ వృత్తిని రాజకీయం, సామాజిక సేవ అని చెప్పారు. ఈసారి దిగువ సభకు ఎన్నికైన వారిలో 121 మంది వ్యాపారవేత్తలు ఉండగా..99 మంది తమ వృత్తి వ్యవసాయమని, 88మంది సామాజికసేవ అని, 86 మంది రాజకీయాలని చెప్పారు. ఈసారి డాక్టర్లు 32, అడ్వొకేట్లు 26, ఉద్యోగులు 13, నటులు 13, పెన్షనర్లు 12, రిటైర్డ్ ఉద్ఉద్యోగులు 8, టీచర్లు 5, రచయితలు, హౌస్ వైఫ్లు, సింగర్లు, సెల్ప్ ఎంప్లాయిడ్ వ్యక్తులు నలుగురు చొప్పున ఎంపీలుగా ఎన్నికయ్యారు. భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఎన్నికల అఫిడవిట్లో వృత్తిని బిక్షగత్తెగా పేర్కొన్నారు.

పెరుగుతున్న మహిళా ప్రాతినిధ్యం
లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదటి లోక్సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 5 శాతం కాగా... 17వ లోక్సభలో అది 14శాతానికి చేరింది. ఈసారి 716మంది మహిళలు పోటీ చేయగా... 78మంది విజయం సాధించారు.












Click it and Unblock the Notifications