ఇక ఆ సంచలనం లేనట్లే!: విలీనానికి నో చెప్పిన స్నాప్ డీల్..
దాదాపు 5నెలల సుదీర్ఘ చర్చలకు తెరదించుతూ ఇక మీదట విలీన ప్రతిపాదన ఉండబోదన్నారు.
న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ విలీనమవబోతున్నాయన్న ప్రచారం గత కొన్ని నెలలుగా వార్తల్లో నానుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి తెరదించుతూ.. ఇక విలీనం లేనట్లేనన్న సంకేతాలు పంపించారు స్నాప్ డీల్ వ్యవస్థాపకులు.
ఈ మేరకు స్నాప్ డీల్ వ్యవస్థాపకులు కునాల్ బాల్, రోహిత్ బన్సల్ వివరాలు వెల్లడించారు. దాదాపు 5నెలల సుదీర్ఘ చర్చలకు తెరదించుతూ ఇక మీదట విలీన ప్రతిపాదన ఉండబోదన్నారు. ఇకనుంచి తమ సంస్థ స్వతంత్రంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రధాన ప్రత్యర్థికి ధీటుగా నిలబడాల్సిందిపోయి.. అందుకు భిన్నంగా విలీనంపై చర్చించడాన్ని వారు వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలోనే ఫ్లిప్ కార్ట్ తో విలీన చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు స్నాప్ డీల్ ప్రతినిధులు ధ్రువీకరించారు. దేశంలో మిలియన్ల కొనుగోలుదారులు, విక్రేతల లైఫ్ చేంజింగ్ అనుభవాల పైనే తమ ఫోకస్ ఉంటుందని వారు ప్రకటించారు. స్నాప్ డీల్ ఇచ్చిన స్పష్టతతో ఇక విలీనం లేనట్లే అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది.