ఇటు కాకలు తీరిన యోధుడు వీరభద్రుడు: అటు కమలనాథుల ఉమ్మడి పోరు
హిమాచల్ ప్రదేశ్లో 1990వ దశకం ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం ప్రారంభమైనా 1998లో కేంద్ర టెలికం మాజీ మంత్రి సుఖ్ రాం సారథ్యంలోని హిమాచల్ వికాస్ పార్టీ (హెచ్వీసీ) సహకారంతో .
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 1990వ దశకం ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. అదే రీతిలో మరో అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం 'షెడ్యూల్' ప్రకటించడంతో కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నెల 23వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా పాత తరం నాయకుడు, ఆరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వీరభద్రసింగ్నే ధైర్యంగా సీఎం అభ్యర్థిగా ముందుకు తేవడం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం. మండీలో జరిగిన ఎన్నికల ముందస్తు ర్యాలీలో సీఎం అభ్యర్థిగా వీరభద్రసింగ్ పేరును మండీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఆ పార్టీని పరీక్షకు నిలబెట్టింది. 84 ఏళ్ల వీరభద్ర సింగ్ తన రాజకీయ జీవితాన్ని 1962లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రారంభించారు. తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లోనూ, యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనూ వీరభద్ర సింగ్ మంత్రిగా పని చేశారు. మిగతా సమయం అంతటా రాష్ట్ర సీఎంగా 22 ఏళ్ల పాటు ఆరుసార్లు సేవలందించిన ఘనత వీరభద్ర సింగ్ది.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్.. ప్రతిష్ఠను ఆయుధంగా చేసుకుని బీజేపీ ఎన్నికల సమరంలో ముందు నిలిచింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కమలనాథులు తహతహలాడుతున్నారు. చరిత్ర కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతుంది. 1990వ దశకం ప్రారంభం నుంచి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీలు ఐదేళ్లకోసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి.

2014 నుంచి సీఎం అభ్యర్థులను ప్రకటించకుండానే విజయాలు
ప్రస్తుత సీఎం వీరభద్ర సింగ్నే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించగా, విపక్షంలో ఉన్న బీజేపీలో మాత్రం పాత, కొత్త నేతల మధ్య అలజడి చెలరేగుతోంది. కానీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉన్నది. కమలం పార్టీలో నేతల ఆలోచనలేమిటన్నది అధిష్ఠానానికి తెలుసు. ఈ పరిస్థితుల్లోనే ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ఎన్నికల బరిలో ఉమ్మడిగా పోరుకు సిద్ధమవుతున్నది. బిలాస్పూర్లో జరిగిన ముందస్తు ఎన్నికల ప్రచార ర్యాలీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. దేశవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని పెంపొందించడంలో నడ్డా కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించడం ద్వారా కమలం పార్టీ శ్రేణులకు నడ్డా సీఎం అభ్యర్థి అన్న సంకేతాలిచ్చారు. కానీ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ మాత్రం ప్రధాని మోదీ నుంచి అనుకున్నంత మద్దతు పొందలేకపోయారు. సీఎం అభ్యర్థిగా ధుమాల్ పేరును ప్రధాని మోదీ ప్రకటించకపోవడంతో అసలు ఆలోచనలేమిటో అవగతమవుతూనే ఉన్నాయి. గతంలో ఏనాడూ 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ సీఎం అభ్యర్థులను ప్రకటించకుండానే విజయాలను సొంతం చేసుకున్నది.

జీఎస్టీ విషయమై కమలనాథులపై బీజేపీలో వ్యతిరేకత
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి విషమించిందని, ఐదోసారి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఆరోపణలపై ఆయన అక్రమాస్తులపై వీరభద్ర సింగ్పై సీబీఐ కేసుల దర్యాప్తు సాగుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నా పూర్తిగా వెనుకబడి పోలేదు. మరోవైపు బీజేపీ నాయకత్వం కూడా ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్లకుండా ఆచితూచి అడుగులేస్తున్నది. ప్రత్యేకించి గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు ప్రభావం, ఈ ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమలు చేయడంలో లోపాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేయడమే దీనికి కారణమని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, చిల్లర వ్యాపారులు.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక విధానాల అమలుకు మోదీ సర్కార్ పూనుకోవడంతో వ్యతిరేక వాణి వినిపిస్తున్నారు.

సుఖ్ రాం సారథ్యంలో తొలి సంకీర్ణ సర్కారం ఇలా
హిమాచల్ వికాస్ కాంగ్రెస్ (హెచ్వీసీ) అనే పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించిన కేంద్ర మాజీ టెలికం మంత్రి సుఖ్ రాం అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. దీంతో 1998 ఎన్నికల సందర్భంగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించారు. దీంతో ప్రాంతీయ పార్టీని స్థాపించారు. 1998 ఎన్నికల్లో సుఖ్ రాం పార్టీ హెచ్వీసీ నాలుగు స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్, బీజేపీలకు సమానంగా సీట్లు వచ్చాయి. దీంతో తొలిసారి ప్రేమ్ కుమార్ ధుమాల్ సారథ్యంలో బీజేపీ - హెచ్ వీసీ సంకీర్ణ ప్రభుత్వాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 2012 ఎన్నికల ముందు బీజేపీ నుంచి బయటకు వచ్చిన మహేశ్వర్ సింగ్ అంతగా విజయం సాధించలేకపోయారు. ఆయన ఏర్పాటు చేసిన హిమాచల్ లోఖిత్ పార్టీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్నది. పలు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు మహేశ్వర్ సింగ్. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. దీంతో రెండోసారి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు విఫలమైంది.

ఎన్నికల్లో పోటీకి ఇలా వ్యక్తుల ఆశలు
ఇక కమ్యూనిస్టులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలో ఒక్కరు కూడా గెలుపొందలేదు. ఆసక్తి కరమైన అంశమేమిటంటే నూతన వ్యక్తులు మరోసారి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టిక్కెట్లు లభించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. ధర్మశాలకు చెందిన ఒక గూర్ఖా ఎక్స్ సర్వీస్ మెన్ సౌదీ అరేబియాలో బిజినెస్లో సంపాదించుకుని వచ్చి జోగిందర్ నగర్ స్థానం కోసం ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి రిటైరైన అధికారులు, కొందరు వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి సేవ చేసేందుకు ఆసక్తిగా ముందుకు చూస్తున్నారు. యువతరం కూడా ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసేందుకు గల అవకాశాలపై సునిశితంగా ద్రుష్టి సారించారు. రద్దయ్యే అసెంబ్లీ ఐదేళ్లు సాదాసీదాగానే సాగింది. 68 స్థానాలు గల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో 36 మంది, బీజేపీలో 26, హిమాచల్ ప్రదేశ్ లోఖిత్ పార్టీ (తర్వాత బీజేపీలో విలీనమైంది) ఒకటి, ఐదుగురు స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications