కాంగ్రెస్ కొత్త బాస్గా ముకుల్ వాస్నిక్..? రేపు అధికారిక ప్రకటన..!!
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవీ కోసం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడిని దాదాపుగా కన్ఫామ్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అధికారింకగా శనివారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సోనియాగాంధీతో కాంగ్రెస్ ముఖ్య నేతలు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, ఏకే ఆంటోని సమావేశమయ్యారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో తానే కాదు గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి కూడా ఎవరూ అధ్యక్ష పదవీ చేపట్టబోరని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గాంధీ నెహ్రూ కుటుంబాల నుంచి కాకుండా ఇతర నేతకు అధ్యక్ష పదవీ వరిస్తోంది. సోనియాగాంధీ అధ్యక్ష పదవీ చేపట్టకముందు సీతారాం కేసరీ పార్టీ బాధ్యతలను నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇతర నేత కాంగ్రెస్ చీఫ్ పదవీ చేపట్టబోతున్నారు. ఆ జాబితాలో ముకుల్ వాస్నిక్ పేరు జోరుగా వినిపిస్తోంది. ముకుల్ వాస్నిక్కు పార్టీపరంగా, పాలానాపరంగా అనుభవం ఉంది. ఆయన యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
134 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నాన్ గాంధీ అధ్యక్ష పదవీ చేపట్టనుండటం చర్చకు తావిస్తోంది. సోనియా, రాహుల్తోపాటు ప్రియాంక కూడా ఉన్న నేపథ్యంలో ఇతర నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తామని రాహుల్ భీష్మించుకొని కూర్చొన్నారు. రాహుల్ను తిరిగి అధ్యక్ష పదవీ చేపట్టాలని కోరినా .. అందుకు ఆయన ససేమిరా అనడంతో మరో నేతను సీడబ్ల్యూసీ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి అధ్యక్షుడు లేకుండా ఇప్పటికే రెండు నెలలు అవుతుంది. మరింత ఆలస్యం చేస్తే బాగుండదని సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలు భావించారు. ఈ క్రమంలో కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కేంద్రం ఎత్తేయడం, విభజన బిల్లుకు ఆమోదం తెలిపి .. ఆ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో కొంత నష్టం జరిగినట్టు అభిప్రాయానికి వచ్చారు.