ప్రధాని మోదీతో "ఢీ" - పూర్వ వైభవమే లక్ష్యంగా : నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్..!!
సుదీర్ఘ రాజకీయ అనుభవం..గతమెంతో ఘనమైన చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శకు సిద్దమైంది. బలమైన ప్రత్యర్ధి పార్టీ బీజేపీని ఎదుర్కొని..పూర్వ వైభవం సాధించటమే లక్ష్యంగా చింతన్ శిబిర్ పేరిట శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకునేందుకు ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. బలమైన కమలదళాన్ని ఢీకొట్టే ముందు పార్టీని పూర్తిగా సంస్కరించాలని పార్టీలోని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో జరగనున్న తాజా సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

సోనియా ప్రారంభోపన్యాసంతో...
ఉదయ్ పూర్ కేంద్రంగా మూడు రోజుల పాటు సాగే ఈ చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన 400 మంది ప్రధాన నేతలు పాల్గొంటారు. చివరిసారిగా 2013లో చింతన్ శిబిర్ను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో 2019 ఎన్నికల తరువాత నాయకత్వ సమస్య ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధ్యక్షురాలిగా కొనసాగుతున్నా.. పార్టీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని జీ23 నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు..నాయకత్వం అంశాల పైన ఈ సమావేశాల్లో ప్రధాన అజెండాగా చర్చించనున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్గాంధీ తిరిగి స్వీకరించాలని పలువురు నేతలు సూచిస్తున్నా..అందుకు ఆయన సిద్దంగా లేరని తెలుస్తోంది.

400 మంది ప్రతినిధులు - ఆరు గ్రూపులుగా
ఈ మూడు రోజుల భేటీలో ప్రధానంగా పార్టీ పునరుద్దరణ కీలక అంశం కానుంది. అదే విధంగా త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..2024 ఎన్నికల దిశగా కార్యాచరణ పైన చర్చించనున్నారు. కేంద్ర- రాష్ట్ర సంబంధాలు, జమ్ముకశ్మీర్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, పెట్టుబడుల ఉపసంహరణ, ఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరి, సామాజిక అసమానతలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ పార్టీలతో పొత్తుల వంటి కీలక అంశాలకు సంబంధించి పార్టీ ముఖ్య నాయకత్వం చర్చించి.. ఒక విధానపరమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగంతో సదస్సు ప్రారంభంసదస్సులో వివిధ అంశాలపై 400 మంది ప్రతినిధులు ఆరు బృందాలుగా మారి చర్చరెండు రోజులపాటు ఈ చర్చలు కొనసాగాక, మూడోరోజున డిక్లరేషన్మూడోరోజు జరిగే సీడబ్ల్యూసీ భేటీలో డిక్లరేషన్పై చర్చలువిస్తృత చర్చల అనంతరం 'నవ సంకల్ప తీర్మానం'తో ఈ శిబిరం ముగుస్తుంది.

రాహుల్ ముగింపు ప్రసంగం - కీలక నిర్ణయాలకు ఛాన్స్
ముగింపు రోజున రాహుల్గాంధీ ప్రసంగించనున్నారు. యూపిఏ బలోపేతంతో పాటుగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించి.. బీజేపీకి వ్యతిరేకంగా తమతో జత కట్టేలా ఒప్పించే విధంగా ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా తమ పార్టీతో పాటుగా..అటు బీజేపీతోనూ దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలను తమ కూటమిలోకి ఆహ్వానించే అంశాలు..అక్కడి స్థానిక పరిస్థితుల పైన అధ్యయనం చేయనున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో కొనసాగుతోంది. 2024 ఎన్నికలకు సంబంధించి సమగ్రమైన..స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో.. దీనికి సంబధించి రోడ్ మ్యాప్ సిద్దం చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ భేటీ తో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే నిర్ణయాలు ఉంటాయా అనే కోణంతో ఇప్పుడు ఈ చింతన్ శిబిర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications