సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీల రాజీనామాలపై కాంగ్రెస్ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో భూకంపాన్నిపుట్టించాయి. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా- ఏ ఒక్క చోట కూడా నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పంజాబ్ను సైతం కోల్పోవడం.. కాంగ్రెస్ పార్టీ పతనానికి పరాకాష్ఠ. గోవా, ఉత్తరాఖండ్లల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసినా వాస్తవ ఫలితాలు దానికి భిన్నంగా వెలువడ్డాయి.
మసకబారిన ఛరిష్మా..
ఒక వెలుగు వెలిగిన ఉత్తర ప్రదేశ్లో హస్తం పార్టీకి దక్కినవి రెండంటే రెండు స్థానాలే. పార్టీ తురుఫుముక్కగా భావించిన ప్రియాంకాగాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నప్పటికీ- అది ఏ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సీట్ల సంఖ్యను మరింత తగ్గించింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఛరిష్మా మసక బారిందనడానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారాయి. పార్టీ ఉనికి ఉంటుందా? లేదా? అనే పరిస్థితులు ఏర్పడ్డాయి.
సీడబ్ల్యూసీ భేటీ ఈ సాయంత్రమే..
ఫలితాలు వెలువడిన మూడో రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకంది. ప్రస్తుతం అందరి దృష్టీ ఈ సమావేశం మీదే నిలిచింది. ఈ సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకానుంది. సోనియాగాంధీ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉదయం 10:30 గంటలకు ఆమె నంబర్ 10, జన్పథ్ నివాసంలో పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
రాజీనామా చేస్తారంటూ..
సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ కీలక నిర్ణయాన్ని తీసుకుంటారని, ఆమె తన పదవులన్నింటికీ రాజీనామా చేస్తారంటూ వార్తలు వెలువడ్డాయి. సోనియా సహా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా సైతం తప్పుకొంటారని, ఓ రకంగా కాంగ్రెస్కు గుడ్బై చెబుతారనేది వాటి సారంశం. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలుకావడానికి నైతిక బాధ్యత వహిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం విస్తృతంగా సాగింది.
తోసిపుచ్చిన కాంగ్రెస్..
ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఈ వార్తలు నిరాధారమైనవని సీనియర్ నాయకుడు రణ్దీప్ సింగ్ సుర్జేవాలా స్పష్టం చేశారు. మీడియా ఉద్దేశపూరకంగా రాజీనామా వార్తలను ప్రసారం చేస్తోందని అన్నారు. పార్టీ నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి వార్తలను ప్రసారం చేయడం తగదని చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం పేరుతో అబద్ధాన్ని మీడియా ప్రసారం చేసిందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార భారతీయ జనతా పార్టీ ఆదేశాలతోనే ఈ రకమైన తప్పడు ప్రచారం చేసిందని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ల భేటీ..
అదే సమయంలో కాంగ్రెస్కు చెందిన జీ-23 నాయకులు కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇవ్వాళే ఈ సమావేశం కూడా ఉండొచ్చని తెలుస్తోంది. నాయకత్వ మార్పిడి విషయంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవడం, సమర్థులైన బయటి నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అజెండా త్వరలోనే ఖరారవుతుంది.
ఆ నేతలు వీరే..
భూపీందర్ సింగ్ హుడా, రాజీందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీష్ తివారీ, వివేక్ టంఖా, ఆనంద్ శర్మ, పీజే కురియన్, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, అజయ్ సింగ్, రేణుకా చౌదరి, మిలింద్ దేవ్రా, శశిథరూర్, సందీప్ దీక్షిత్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, కౌల్ సింగ్ ఠాకూర్, కుల్దీప్ శర్మ, యోగానంద్ శాస్త్రి ఉన్నారు. వీరంతా ఢిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్కు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకుని రావడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు.