పంతం నెగ్గించుకున్న దేవేగౌడ, కుమారస్వామి, ఆర్థిక శాఖ, వెనక్కి తగ్గిన కాంగ్రెస్, పవర్ !
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకాల్లో చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి తరువాత అంతే ప్రాముఖ్యం ఉన్న ఆర్థిక శాఖ జేడీఎస్ కా, కాంగ్రెస్ కా అంటూ ఇంతకాలం చర్చలు జరిగాయి. అయితే దేవేగౌడ, కుమారస్వామి పంతం నెగ్గించుకున్నారని, పవర్ మొత్తం జేడీఎస్ చేతికి వచ్చిందని తెలిసింది.
ఆర్థిక శాఖ కోసం పట్టు
ఆర్థిక శాఖ మాకు కావాలంటే మాకు కావాలి అంటూ కాంగ్రెస్, జేడీఎస్ పట్టుబట్టాయి. అయితే ఆర్థిక శాఖను జేడీఎస్ కు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబి ఆజాద్ అంగీకరించారని మంగళవారం ఆ పార్టీ నాయకులు తెలిపారు.
Recommended Video
సీఎం చేతికి ఆర్థిక శాఖ
జేడీఎస్ కు ఆర్థిక శాఖ కేటాయిస్తే ఆ పార్టీలో ఆ శాఖను సమర్థవంతంగా నడిపించే అనుభవం ఉన్న నాయకుడు ఎవరున్నారు అనే ప్రశ్న ఇప్పుడు మొదలైయ్యింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఆర్థిక శాఖను ఆయన దగ్గరే పెట్టుకుంటారని సమాచారం.
జేడీఎస్ కింగ్
కర్ణాటక శాసన సభలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ కింగ్ అయ్యింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకూడదని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జేడీఎస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
దేవేగౌడ సీరియస్
జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకుల దగ్గరకు వెళ్లలేదని, వాళ్లే మా దగ్గరకు వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని మనవి చేశారని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే సీఎం పదవి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి కుమారస్వామి సిద్దంగా ఉన్నారని మాజీ ప్రధాని దేవేగౌడ బాంబు పేల్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక శాఖ విషయంలో వెనక్కి తగ్గారని తెలిసింది.