సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న చెప్పిందే కరెక్ట్..!!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి- పెద్ద నోట్ల రద్దు. 1,000, 500 రూపాయి నోట్లను చిత్తు కాగితాలుగా ప్రకటిస్తూ 2016 నవంబర్ 8వ తేదీన ప్రకటన చేశారు మోదీ. అప్పటివరకు చలామణిలో ఉన్న ఆయా నోట్లన్నీ ఎందుకూ కొరగాకుండా పోయాయి. వాటిని మార్పిడి చేసి, కొత్త నోట్లను తీసుకోవడానికి దేశ ప్రజలందరూ బ్యాంకుల ముందు బారులు తీరి నిల్చున్నారు అప్పట్లో.
జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిర్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం- ఇవ్వాళ పెద్ద నోట్ల రద్దుపై తన నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ అయిదు మందిలో నలుగురు న్యాయమూర్తులు పెద్ద నోట్ల రద్దుకు అనుకూలంగా ఉండగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం దీన్ని వ్యతిరేకించారు. 4:1 నిష్పత్తితో సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడ్డాయి.
పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వ నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని, అందుకే తాను ఆ నిర్ణయాన్ని సమర్థించట్లేదని జస్టిస్ బీవీ నాగరత్న తేల్చి చెప్పారు. నోట్ల రద్దు ప్రక్రియను కేంద్రం ప్రారంభించి ఉండకూడదని అన్నారు. 2016 నాటి అంశం కావడం వల్ల అప్పటి యథాతథ స్థితిని ఇప్పుడు పునరుద్ధరించలేమని వ్యాఖ్యానించారు.
పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన ఆదేశాలు సరైన చర్య కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు జైరామ్ రమేష్, పీ చిదంబరం అన్నారు. పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ యాక్ట్ లోని సెక్షన్ 26 (2)ను సరిగ్గా వర్తింపజేసిందా? లేదా? అనే విషయంపైనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అంతకుమించి ఇంకేమీ ఇందులో లేదని జైరామ్ రమేష్ అన్నారు.
జస్టిస్ బీవీ నాగరత్న చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించారని గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశ వృద్ధి రేటు వేగాన్ని దెబ్బతీసిందిని, ఎంఎస్ఎంఈలను నిర్వీర్యం చేసిందని జైరామ్ రమేష్ అన్నారు. అసంఘటిత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ఫలితంగా లక్షలాది మంది జీవనోపాధిని కోల్పోయారని చెప్పారు.