యడ్యూరప్ప ఎఫెక్ట్: మహత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్, జెడి(ఎస్) నేతల ధర్నా
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజెపి నేత, యడ్యూరప్ప ప్రమాణస్వీకరాం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు విధానసభ ఆవరణలో ఉన్న మహత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బిజెపికి అవకాశం కల్పిస్తూ గవర్నర్ విజూభాయ్ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో గురువారం నాడు ఉదయం కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేశారు.
అయితే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు విధాన సభ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట గురువారం నాడు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గే, సిద్ద రామయ్య తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు జెడి(ఎస్) నేతలు కూడ ఈ ధర్నాలో పాల్గొన్నారు.