గుజరాత్ లో 200 నుంచి 3 వేల ఓట్ల తేడా: కాంగ్రెస్ ను ముంచేసిన 10 సీట్లు, తేడా !
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను వ్యతిరేకించిన కొందరు ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇక ఎన్సీపీతో మొదటి నుంచి పొత్త పెట్టుకుంటామని నమ్మించి చివరికి కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. గుజరాత్ లో దాదాపు 10 శాసన సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 200 నుంచి 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
Recommended Video
ఎన్సీపీ, నోటా ఓట్ల దెబ్బ
గుజరాత్ లోని 182 శాసన సభ నియోజక వర్గాల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్సీపీ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడంతో బీజేపీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అతి విశ్వాసానికి పోవడం, ప్రధాని మోడీని నోటికి వచ్చినట్లు దూషించడంతో మొదటికే మోసం వచ్చింది.
మంత్రి మెజారిటీ 327 ఓట్లు
అహ్మదాబాద్ లోని దోల్కా శాసన సభ నియోజకవర్గంలో గుజరాత్ మంత్రి భూపీందర్ సింహా మనుభ చుందసుమ పోటీ చెయ్యగా 71, 530 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అశ్విన్ రాథోడ్ కు 71, 203 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 327 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి 4,222 ఓట్లు, 2, 347 నోటా ఓట్లు పడ్డాయి.
గోద్రాల్ గోల్ మాల్
గోద్రా శాసన సభ నియోజక వర్గంలోని బీజేపీ అభ్యర్థి సీకే. రౌల్ జీ పోటీ చెయ్యగా 75,149 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పార్మర్ రాజేంద్రసింహా కు 74, 891 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుతో మరో రాజేంద్రసింహా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యడంతో 18,856 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పేర్లు ఒక్కటి కావడంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది.
కాంగ్రెస్ కు ఎన్సీపీ దెబ్బ
ఫాతేపుర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి కతరా రమేష్ భాయ్ బాహురాభాయ్ కి 60, 250 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘుభాయ్ దత్తాభాయ్ కి 57, 539 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని ఎన్సీపీ పోటీకి దింపిన ప్రభూభాయ్ కి 2, 747 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ ను ఎన్సీపీ దారుణంగా దెబ్బ తీసింది.
వెయ్యి ఓట్లు తేడా
బోతాద్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి సౌరబ్ పటేల్ (దలాల్) కు 79, 623 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధీరాలాల్ మహదేవ్ జీకి రూ. 78, 717 ఓట్లు వచ్చాయి. కేవలం 1, 106 ఓట్ల తేడాతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటికే పరిమితం అయ్యాడు.
పోరుబందర్ లో పోరు
పోరుబందర్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి బాబూభాయ్ కి 72, 430 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్జున్ భాయ్ దేవాభాయ్ కి 70, 575 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ కేవలం 1, 845 ఓట్లతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
కాంగ్రెస్ కు ఇద్దరి దెబ్బ
విజపురలో బీజేపీ నుంచి పటేల్ రమణభాయ్ పోటీ చెయ్యగా 72, 320 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పటేల్ నాథాభాయ్ కి 71, 162 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు ఇద్దరూ స్వతంత్రులుగా పోటీ చెయ్యడంతో దాదాపు 3, 600 ఓట్లు చీలిపోయాయి. ఇక్కడ బీజేపీ కేవలం 1, 164 ఓట్లతో విజయం సాధించింది.
ఇదే కాంగ్రెస్ కు దెబ్బ
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని చోట్ల పోరపాట్లు జరిగాయని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లేదంటే గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 87 సీట్లు వచ్చి ఉంటాయని ఓట్ల శాతం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో చివరి నిమిషం వరకూ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అనే పోటీ పడ్డాయి. 10 నియోజక వర్గాల్లో కాంగ్రేస్ పార్టీ కేవలం 200 నుంచి 3,000 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.