మసూద్కు నాలుగేళ్లు జైలు: అరెస్టు చేసి జైలుకు
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రషీద్ మసూద్కు అవినీతి కేసులను విచారించే న్యూఢిల్లీలోని కోర్టు మంగళవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు శిక్షను ఖరారు చేసిన తర్వాత ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. త్రిపుర మెడికల్ కాలేజీ సీట్ల కుంభకోణంలో ఆయన దోషిగా తేలారు.
మోసం చేసినందుకు, క్రిమినల్ కుట్రకు పాల్పడినందుకు, ఫోర్జరీకి దిగినందుకు కోర్టు గతవారం రాజ్యసభ సభ్యుడైన 66 ఏళ్ల రషీద్ మసూద్ను దోషిగా తేల్చింది. కేసును విచారించిన సిబిఐ ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని కోర్టును అభ్యర్థించింది.
చట్టాలను రూపొందించే వ్యక్తి చట్టాలను ఉల్లంఘించారని సిబిఐ తరఫు న్యాయవాది అన్నారు. నేరాలకు పాల్పడినట్లు కోర్టులో రుజువై రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు వెంటనే అనర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత మొదట దోషిగా తేలిన ప్రజాప్రతినిధి రషీద్ మసూద్.
అర్హత లేని విద్యార్థులకు వైద్య కళాశాలల్లో 1990ల్లో సీట్ల కేటాయింపులు జరిగిన కేసులో ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ దుర్వినియోగానికి పాల్పడినందుకు రషీద్ మసూద్ దోషిగా తేలాడు. 1990ల్లో విపి సింగ్ ప్రభుత్వ హయాంలో రషీద్ మసూద్ ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.