సిద్ధూ రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు-అమరీందర్ ఒత్తిడి-సీఎం చన్నీకి చుక్కలు
పంజాబ్ కాంగ్రెస్ లో పరిణామాలు నిన్నన వేగంగా మారిపోయాయి. అమరీందర్ సింగ్ స్ధానంలో తాను సీఎం కొవొచ్చని ఆశలు పెట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా పోరాడిన సిద్ధూకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. దీంతో పీసీసీ అధ్యక్ష పదవికి నవ్ జ్యోత్ సింగ్ రాజీనామా చేసి తన నిరసన తెలుపుతున్నారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న మూడు ముక్కలాట నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూకు మద్దతుగా ముగ్గురు మంత్రులు, దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఎటూ పాలుపోవడం లేదు. దీంతో అమరీందర్ ను సులువుగా తప్పించగలిగామన్న సంతోషం ఆ పార్టీ పెద్దలకు మిగలడం లేదు. దీంతో సిద్ధూ విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్దితి మరింత విషమించడం ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి అడుగులేస్తోంది.
ఇప్పటికే సిద్ధూతో టచ్ లో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజీనామా ఉపసంహరణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధూ మాత్రం చరణ్ జీత్ సింగ్ చన్నీ కేబినెట్ లో అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రుల్ని తీసుకోవద్దంటూ తాను చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని పదేపదే గుర్తుచేస్తూ వారిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాజాగా మంత్రులైన వారిని తప్పించలేక, అలాగని సిద్ధూ డిమాండ్లను పక్కనబెట్టలేక కాంగ్రెస్ అధిష్టానం ఇరుకునపడుతోంది.
ఐదు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో సిద్ధూ రాజీనామా పంజాబ్ కాంగ్రెస్ ను కుదిపేస్తోంది. సిద్ధూ మాటల్ని నమ్మి అమరీందర్ ను తొలగించడం, తిరిగి సిద్ధూకు అవకాశం ఇవ్వకుండా దళిత పంజాబీ చరణ్ జీత్ సింగ్ చన్నీకి అవకాశం ఇవ్వడంతో సంక్షోభం మరింత ముదురుతోంది. దీంతో చన్నీకి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు సిద్ధూ రెచ్చిపోతున్నారు. అలాగని పంజాబ్ కాంగ్రెస్ పై పట్టు పెంచుకుంటున్న సిద్ధూను వెంటనే తప్పించే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మధ్యేమార్గం కోసం సంప్రదింపులు జరుపుతోంది.