కాంగ్రెసు మార్క్ పొలిటిక్స్: నగ్మా వర్సెస్ ఖుష్బూ
న్యూఢిల్లీ: తమిళనాడులో కాంగ్రెసు మార్కు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఏఐసీసీ మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులైన నగ్మాతో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన ఖుష్బూకు చెక్ పెట్టించాలని ఓ వర్గం భావిస్తోంది. దానికోసం ఖుష్బూ వ్యతిరేక వర్గం పావులు కదుపుతోంది.
అందులో భాగంగా ఈనెల 22వ తేదీన నగ్మాను చెన్నైకు ఆహ్వానించి ఆమెకు సత్కారం చేయాలని నిర్ణయించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నగ్మా గత 16వ తేదీన చెన్నై చేరుకున్నారు. ఆ రోజున ఆమె సత్యమూర్తి భవన్లో మీడియాను కలుసుకుంటారని ముందుగా ప్రకటించారు.
అయితే ఆఖరి క్షణంలో ఆమె సత్యమూర్తి భవన్ కార్యక్రమం రద్దయింది. చెన్నై విమానాశ్రయంలో నగ్మా ఆహ్వాన కార్యక్రమంలోనూ కలకలం చెలరేగింది. మహిళా కాంగ్రెస్ ఆధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధారణి వర్గం నేతలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మర్నాడు తూత్తుకుడిలో జరిగిన కాంగ్రెస్ ప్రాంతీయ మహానాడులో నగ్మా పాల్గొనేందుకు ఆసక్తితో ఉండగా చివరి సమయంలో ఆ కార్యక్రమం కూడా రద్దయింది.
ప్రస్తుతం తమిళనాడు పిసిసి అధినేత ఈవీకేఎస్ ఇళంగోవన్కు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులైన ఖుష్బూ అత్యంత సన్నిహితురాలు. అదేసమయంలో ఎమ్మెల్యే విజయధారణి ఇళంగోవన్కు వ్యతిరేకంగా ఉన్నారు. దానికితోడు టీఎన్సీసీ అధ్యక్ష పదవి రేస్లో విజయధారణి ఉంది. ఇదే జరిగితే ఖుష్బూను బరిలోకి దించాలని ఇళంగోవన్ భావిస్తున్నారు.
దానికి చెక్ పెట్టేందుకు విజయధారణి చక్రం తప్పి నగ్మాకు దగ్గరయ్యారు. దీనికితోడు ఈమె అఖిల భారత మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులు కావడం విజయధారిణికి కలిసొచ్చిన అంశంగా మారింది. ఆ స్థితిలో ఈ నెల 22వ తేదీన నగ్మాను సత్యమూర్తి భవన్కు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
గత 4వ తేదీ నుంచి తాను పర్యటనలో ఉన్నానని, నగ్మా వచ్చిన రోజున చెన్నైలో లేనందున ఆహ్వానించడానికి వీలు కాలేదని విజయరాణి సర్దిచెప్పుకున్నారు. దీంతో నిర్వాహకులను పంపినట్లు తెలిపారు. 22 వ తేదీ విజయదశమి రోజున సత్యమూర్తి భవన్లో మహిళా కాంగ్రెస్ భవనం ప్రారంభోత్సవం జరగనుందని, ఈ కార్యక్రమానికి నగ్మా, కుష్బూలను ఆహ్వానించామని చెప్పారు. మొత్తం మీద, తమిళ కాంగ్రెసు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.