యుద్ధానికి వెళుతూ ఎవరైనా కెమెరాలు తీసుకెళతారా: కాంగ్రెస్ పై మోడీ ఫైర్
Recommended Video
ప్రధాని మోడీ మండిపడ్డారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సర్జికల్ స్ట్రైక్స్పై కాంగ్రెస్ పార్టీ రుజువులు అడుగుతోందని... సర్జికల్ స్ట్రైక్స్ చేసే సమయంలో జవాన్లు తమ వెంట ఆయుధాలు మోసుకెళుతారే తప్ప కెమెరాలు కాదని అన్నారు. అంతేకాదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో దేశానికి భద్రత మరింత పెరిగిందని గుర్తు చేశారు.
కశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు ఉగ్రవాదులు వెళ్లాలంటే అది జరిగే పని కాదని మోడీ అన్నారు. అదే యూపీఏ సర్కార్ దేశ భద్రతను గాలికి వదిలేసిందని... అందుకే నాడు ఉగ్రవాదులు పేట్రేగిపోయారని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టుల కదలికలు తమ హయాంలో తగ్గాయంటే... ఇందుకు కారణం తమదైన శైలిలో వారికి సమాధానం ఇవ్వడమే అని చెప్పారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వారు తన కులం గురించి అడుగుతున్నారని, తన కుటంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డ ప్రధాని మోడీ... ఇదంతా రాహుల్ గాంధీ దగ్గరుండి చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే నేరుగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ... ఆ వ్యక్తి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారని, పుట్టడమే ఆస్తిపరుడిగా పుట్టాడని, అందుకే తనకు సామాన్యుడి కష్టాలు తెలియవని పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు మోడీ.
ప్రజలను చంపుతున్న మావోయిస్టులను తిరుగుబాటుదారులుగా కాంగ్రెస్ పేర్కొనడాన్ని మోడీ ఖండించారు. వారికి ఇలాంటి సర్టిఫికేట్ ఇవ్వడమేంటంటూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీని కానీ, ఆ పార్టీ నేతలను కానీ పెద్దగా పట్టించుకోవక్కర్లేదని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొబైల్ ఫోన్లు దుగార్పూర్లో తయారవుతాయని వాటిపై మేడిన్ దుంగార్పూర్ అనే లేబుల్ వస్తుందని రాహుల్ చెప్పినట్లు గుర్తు చేసిన ప్రధాని అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.