నిలకడగా ఆరోగ్యం... ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస కోశ సంబంధిత సమస్యతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో గురువారం చేరిన విషయం తెలిసిందే. సోనియా ప్రస్తుత ఆరోగ్య స్థితిపై ఆసుపత్రి మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా మాట్లాడుతూ, డిశ్చార్జ్ చేసే సమయానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.
ఆమెకు విశ్రాంతి అవసరమని, మందులు కొనసాగించాలని పేర్కొన్నారు. సోనియా గాంధీకి శ్వాస కోశ సంబంధిత ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిందని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తెలిపారు.
గతంలో కాన్సర్ బారినపడిన సోనియా గాంధీ అమెరికాలో చికిత్స పొందారు. అయితే, ఇప్పుడు సోనియా గాంధీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. గత ఏడాది సోనియా గాంధీ పార్లిమెంట్ సమావేశాల సమయంలో కూడా అస్వస్థతకు గురి కాగా, రాహుల్ గాంధీ ఆమెను ఎయిమ్స్కి తరలించారు.
ఆ సమయంలో లోక్సభలో ఆహార భద్రత బిల్లుపై చర్చ జరుగుతోంది. చలికాలంలో శ్వాస కోస సమస్య సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. 2008లో సోనియా గాంధీ ఆరురోజులపాటు ఆస్తమాకు సంబంధించి ట్రీట్మెంట్ ని తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.