మోడీకి మరో 15 ఏళ్లు: వెంకయ్య, హిందూ వ్యతిరేకతా: కాంగ్రెస్ ప్రశ్న
బెంగళూరు/విశాఖ: మతమార్పిళ్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని, ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ లోకసభలో వివాదం సృష్టిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని వాజపేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కొన్ని మతాల్లోకి మార్పిడి కోసం విదేశాల నుండి కోట్లాది రూపాయల నగదు దేశంలోకి వస్తున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. నిజానికి మతం మార్చుకునే అంశం ప్రజల వ్యక్తిగతమైనదని, ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండదని చెప్పారు.
పదేళ్లపాటు ప్రతిపక్షంగా బీజేపీ బాగా పని చేసిందని, ఇప్పుడు ఆ స్థాయి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. దేశం నరేంద్ర మోడీ ప్రభావానికి లోనైందని తాజా ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతోందని, దేశం మొత్తం కాషాయమయమవుతోందన్నారు.
సవాళ్లను అధిగమించి భారత్ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలు మరో 15 ఏళ్లు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్కు అధికారమిస్తే ఏమయిదో అందరు చూశారని, వాజపేయి అందించిన సుపరిపాలన - అభివృద్ధి కావాలంటే మోడీ కొన్నేళ్లు కొనసాగాలన్నారు.

మాజీ ప్రధాని వాజపేయికి ప్రస్తుతం భారతరత్న ప్రకటించినా ఆయన ఇప్పటికే దేశ ప్రజల గుండెల్లో భారతరత్నగా నిలిచిపోయారన్నారు. ఆయనకు భారతరత్న ప్రకటించడంతో ఎంతో మురిసిపోయానని చెప్పారు. వాజపేి తన అనందాన్ని మనతో పంచుకునే స్థితిలో ఉండకపోవడమే బాధకలిగించే అంశమన్నారు.
హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నామా: కాంగ్రెస్ అంతర్మథనం
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం చనిచూసిన కాంగ్రెస్ అంతర్మథనంలో కూరుకుపోయింది. హిందుత్వవాదిగా ముద్రపడిన కాంగ్రెస్ బీజేపీ, ఎన్నికల్లో అదే నినాదంతో ముందుకెళ్లింది. దీంతో మనం ఏమైనా హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నామా అన్న అనుమానం ఆ పార్టీ నాయకత్వంలో మొలకెత్తినట్లుగా కనిపిస్తోంది.
ఇదే విషయం క్యాడర్ను ప్రశ్నించనుందని తెలుస్తోంది. మనం హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నామా అని క్యాడర్ను అడగనుందట. అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించాలని రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. అభిప్రాయ సేకరణ సాదాసీదాగా కాకుండా మెజార్టీ కార్యకర్తల మనోభావాలను వెలికితీయాలని కూడా ఆయన దిశానిర్దేశనం చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications