గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు: ఆ మూడు సీట్లలో పోటీ
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ప్రచార హోరును పెంచాయి. అలాగే తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. తాజాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) జట్టుకట్టాయి. శుక్రవారం ఈ రెండు పార్టీలు ముందస్తు పొత్తు ప్రకటించాయి.
రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాలకు గానూ.. ఎన్సీపీ మూడు స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇరుపార్టీల నేతలు అహ్మదాబాద్లో సమావేశమై వివరాలు వెల్లడించారు. 2017 ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కూటమి ఏర్పాటుకు విఫలయత్నం చేశాయి. దీంతో వేర్వేరుగానే ఎన్నికల బరిలో నిలిచాయి. ఎన్సీపీ తరపున పోటీ చేసిన కుందాల్ జడేజా ఒక్కరే ఆ ఎన్నికలో గెలుపొందారు. ఈసారి మాత్రం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
పొత్తులపై జీపీసీసీ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. కూటమిలో భాగంగా ఆనంద్ జిల్లాలోని ఉమ్రేఠ్, అహ్మదాబాద్లోని నరోదా, దాహోడ్ లోని దేవ్గఢ్ బరియా స్థానాల్లో ఎన్సీపీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని చెప్పారు. కాగా, ఈ మూడు స్థానాలు కూడా బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం గమనార్హం.
ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒకే భావజాలం కలిగినవారితోపాటు రాజ్యాంగ పరిరక్షణ, దేశ సమైక్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నవారు ఒక్కతాటిపై వస్తున్నారని, ఈ కూటమి కూడా అందులో భాగమేనని జగదీశ్ తెలిపారు. మూడు స్థానాలు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీకి ఎన్సీపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు జయంత్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీగా పోటీలో ఉంటామన్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5న రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.