ముస్లిం మహిళలకు కాంగ్రెస్,ఎస్పీ చేసిందేమీలేదు; బీజేపీతోనే ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి: పీఎం మోడీ
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా గత ప్రభుత్వాలు ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం మహిళల దుస్థితిని విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోడీ గత కాంగ్రెస్-ఎస్పీ ప్రభుత్వాలపై దాడి చేశారు.
ప్రత్యర్థి పార్టీల నాయకులు తమ ఓట్ల కోసం ముస్లిం ఆడపిల్లల జీవితంలో అతిపెద్ద సమస్యను విస్మరించారు అని బుధవారం బారాబంకి జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన అన్నారు. ముస్లిం మహిళల జీవితాల్లో ఉన్న కష్టాలను పట్టించుకోలేదని, ముస్లిం సోదరీ మణులకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి చేసింది మా ప్రభుత్వమే అని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆదివారం బారాబంకిలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓటర్లకు, ముఖ్యంగా మహిళలకు బలమైన నియోజకవర్గమైన బారాబంకి లో ముస్లిం మహిళల శ్రేయస్సుకోసం బీజేపీ ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు.

బిజెపి 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం ముస్లిం మహిళల భద్రత మరియు గౌరవాన్ని కాపాడిందని అన్నారు. 2014లో మాకు అవకాశం ఇచ్చినప్పుడు, మేము దాని కోసం చిత్తశుద్ధితో పనిచేశామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.మహిళా పోలీసు సిబ్బంది సంఖ్య 1.1 లక్షల నుంచి 2.25 లక్షలకు పెరగడం మహిళా రక్షణపై బిజెపి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన జన్ధన్ యోజన, ఉజ్వల వంటగ్యాస్ సిలిండర్ కార్యక్రమం వంటి వాటి ప్రయోజనాలను ఆయన ప్రస్తావించారు.
యూపీ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది చిన్న రైతులకు సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. సాగు చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో సాగు చట్టాలను రద్దు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతుల కోసం, మహిళల కోసం చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధికి పట్టం కడుతూ బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications