ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్.. బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణలు
జార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న భారీ నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. బెంగాల్లో దాదాపు రూ.48 నుంచి రూ.50 లక్షల నగదుతో దొరికారు. దీనిపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ అవినాష్ పాండే తెలిపారు.

వాహనాల్లో భారీగా నగదు
ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నామన్ బిక్సల్ కొంగరీ నేషనల్ హైవే 16 మీద రానిహట్ వద్ద వెళుతున్నారు. అయితే పోలీసులు వాహనాన్ని ఆపి.. తనిఖీ చేయగా నగదు పట్టుబడింది. అన్సారీ జమ్తార నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కచ్చప్ ఖిజ్రి నుంచి.. కొంగరి కొలేబిర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మొర్చా ప్రభుత్వం అధికారంలో ఉంది. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఇతరులు కలిసి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారని జార్ఖండ్ కాంగ్రెస్ ఇంచార్జీ అవినాష్ పాండే తెలిపారు. దీనికి సంబంధించి తమ వద్ద ఫోన్ రికార్డింగులు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్తితుల్లో సీఎం హేమంత్ సోరెన్ను తాను కలుస్తానని తెలిపారు.

గిప్ట్ కోసం
నగదు పట్టుబడటం.. దుమారం చెలరేగడంతో ఆ ఎమ్మెల్యేలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అన్సారీ సోదరుడు ఇమ్రాన్ అయితే.. ఆ నగదును గిరిజనులకు ఇవ్వడానికి తీసుకెళ్లారని తెలిపారు. ప్రతీ ఏటా ఇస్తుంటామని.. ఈసారి కూడా ఇస్తున్నామని వివరించారు. జార్ఖండ్ నుంచి కోల్ కతా బడా బజార్ మీదుగా వెళుతుంటారని తెలిపారు. ఏటా బడా బజార్ నుంచి గిరిజనులకు చీరలను తీసుకొస్తామని తెలిపారు.

ఆన్సర్ కావాలి
నగదు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇవ్వాలని జార్ఖండ్ బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాశ్ డిమాండ్ చేశారు. జార్ఖండ్లోని గొడ్డ నిజయోజకవర్గం ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి నగదు స్వాధీనం అంశంపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖల చేత దర్యాప్తు చేయించాలన్నారు. కాంగ్రెస్ను ముక్కలు చేయాలని ప్రస్తుత జార్ఖండ్ ప్రభుత్వం కుట్ర పన్నినట్లు భావిస్తున్నానని తెలిపారు. జార్ఖండ్లో టెండర్లను మేనేజ్ చేయడం కోసం ఈ సొమ్మును ఇచ్చి ఉంటారన్నారు.

దర్యాప్తు జరపాలి
ఈ ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత శశి పంజా డిమాండ్ చేశారు. జార్ఖండ్లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం బేరసారాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో నగదు పట్టుబడిందని టీఎంసీ ఓ ట్వీట్లో గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications