పరాజయాల కాంగ్రెస్ గతిని మలుపు తిప్పే కీలక భేటీ: ముహూర్తం ఇదే: కొత్త రక్తం కోసం..!!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు రాబోతోన్నాడు. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతోంది. సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్కు తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు అధ్యక్ష పదవిని అందుకోబోతోండటం ఖాయమైంది. సోనియా గాంధీకి ఆరోగ్య సహకరించకపోవడం, ఆమె స్థానంలో సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ గాంధీ అంగీకరించకపోవడం వంటి పరిణామాల మధ్య గాంధీయేతర కుటుంబ నాయకుల చేతికి కాంగ్రెస్ వెళ్లనుంది.
తాత్కాలికంగా సోనియా
ఏఐసీసీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలు కావడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకొన్నారు. ఆ తరువాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా నియమితులయ్యారు. మళ్లీ అవకాశం వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో పగ్గాలను అందుకోవడానికి రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఓ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానంటూ స్పష్టం చేశారు.

28న సీడబ్ల్యూసీ..
దీనితో కాంగ్రెస్ పగ్గాలను గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు అందుకోబోతోండటం ఇక లాంఛనప్రాయమే. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను చేపట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు వర్చువల్ విధానంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరూ దీనికి హాజరు కానున్నారు. సోనియా గాంధీ దీనికి అధ్యక్షత వహిస్తారు.

విదేశాల నుంచే..
హెల్త్ చెకప్ కోసం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో విదేశాలకు వెళ్లనున్నారు కలిసి సోనియా గాంధీ. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ ఇదే. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి నిర్వహించ దలిచిన ఎన్నికల షెడ్యూల్ను ఈ సీడబ్ల్యూసీ భేటీలో ఖరారు చేస్తారు. సెప్టెంబర్ మూడో వారం నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తాన్నీ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

హెల్త్ చెకప్ కోసం..
సోనియా గాంధీ తన ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టారు. హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉంటారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ దేశానికి వెళ్తారనేది వెల్లడించలేదు. మున్ముందు కీలక కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications