లింగమార్పిడికి మహిళా కానిస్టేబుల్కు లీవ్, పురుషుడుగా మారనున్న లలితా సాల్వే
ముంబై:ముంబైలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లలితా సాల్వే లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకొనేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. 2010 నుండి ఆమె కానిస్టేబుల్ గా పనిచేస్తోంది.
సాల్వేలో మహిళ కంటే పురుషుడి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమె శరీర తత్వం కూడ స్త్రీ కంటే పురుషుడి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. పురుషుడికి ఉండాల్సిన అంగాలు ఉన్పప్పటికీ అవి పూర్తి స్థాయిలో పనిచేయాలంటే సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ చేయాలని వైద్యులు తేల్చారు.
అయితే లలితా సాల్వేకు లింగ మార్పిడి చికిత్స చేసుకోవాలని భావించింది. ఈ మేరకు ఆమె వైద్యులను కూడ సంప్రదించింది. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేస్తే సంపూర్ణంగా పురుషుుడిగా మారతావనే భరోసాను కూడ కల్పించారు.
ఈ తరుణంలో నెల రోజుల పాటు సెలవు కావాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులను కోరారు. అయితే లింగమార్పిడి శస్త్రచికిత్స కోసం సెలవు ఇచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు ఈ కేసును రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని లలితా సాల్వేకు సూచించింది. ఈ విషయమై సాల్వేకు పలువురు మద్దతుగా నిలిచారు. రోజు రోజుకూ సాల్వేకు మద్దతు పెరుగుతుండడంతో ఈ విషయమై ప్రభుత్బం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
మహారాష్ట్ర ముఖ్యంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయమై లలితా సాల్వేకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నారు. దీంతో రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ లలిత సాల్వేకు నెల రోజుల పాటు సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
దీంతో లలిత సాల్వే శస్త్రచికిత్స చేయించుకోనుంది.శస్త్రచికిత్స తర్వాత సాల్వే పురుషుడిగా మారనుంది. రెండు రోజుల్లోపుగా ఆమె జేజే ఆసుపత్రిలో చేరనున్నారు.ఈ ఆసుపత్రి వైద్యులే ఆమెకు లింగమార్పిడి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.