ఫొటో: బాబు దీక్షలో రక్తం మరిగిన రాక్షసిగా సోనియా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిరవధిక నిరాహార దీక్షా శిబిరంలో అత్యంత వివాదాస్పదమైన పోస్టర్ దర్శనమిచ్చింది. రాష్ట్ర విభజన తీరును తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. యుపిఎ చైర్పర్సన్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని అత్యంత నీచంగా చిత్రీకరించిన పోస్టరును ప్రదర్శించారు.
బుధవారంనాడు చంద్రబాబు నాయుడి దీక్షా శిబిరంలో ఆ పోస్టర్ కనిపించింది. సోనియా నోటి నుంచి రక్తం కారుతున్నట్లుగా చిత్రం ఉంది. ఆమె మెడలో కేంద్ర మంత్రులు, కాంగ్రెసు నేతల తలలతో కూడిన గొలుసును వేలాడదీసుకున్నట్లుగా చిత్రీకరించారు.
పోస్టర్పైన సోనియా డౌన్ డౌన్, యుపిఎ డౌన్ డౌన్ అనే నినాదం రాశారు. రాష్ట్ర విభజనకు సోనియా గాంధీ ఒడిగట్టే విషయంలో రాక్షసత్వం ప్రదర్శించడానికి చెప్పడానికి ఈ చిత్రాన్ని ప్రదర్శించినట్లు అర్థమవుతోంది.
సోనియా గాంధీ చిత్రాన్ని అసభ్యంగా ప్రదర్శిస్తూ వేసిన చాలా పోస్టర్లను తీసేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ మాత్రం ఢిల్లీ పోలీసుల బారికేడ్లపై బుధవారంనాడు కనిపించింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు నీచ రాజకీయాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు దీక్ష గురువారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఆయన సోమవారంనాడు దీక్షను ప్రారంభించారు.