ఇది మోదీ-షాల మారణహోమం -కూచ్బెహార్ కాల్పులపై బెంగాల్ సీఎం మమతా ఫైర్ -ఈసీపైనా విమర్శలు
పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ సందర్భంగా తలెత్తిన హింసపై రాష్ట్ర, కేంద్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూచ్బెహార్లోని శీతల్కుచి నియోజకవర్గంలో శనివారం పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. వీరిలో ఒకరు హత్యకు గురికాగా, కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలొదిలారు. కాగా, కేంద్ర బలగాల చర్యను మారణహోమంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు.
టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం సిలిగురిలో మీడియాతో మాట్లాడారు. కూచ్బెహార్ కాల్పుల ఘటనను కేంద్రం ఉద్దేశపూర్వకంగా జరిపిన మారణహోమంగా అభివర్ణించారు. ఆ ఘటనపై నిజాలు బయటికి రాకుండా ఎన్నికల సంఘం కుట్రలు చేస్తోందని, నిజాలను అణచివేసే ప్రయత్నాలు చేస్తోందని దీదీ ఆరోపించారు. కూచ్బెహార్ కాల్పులకు వ్యతిరేకంగా టీఎంసీ శ్రేణులు ఆదివారం నాడు బ్లాక్ డే పాటిస్తున్నారు.

''ఇదో సామూహిక హత్యాకాండ. చంపేయడానికే వారు (సీఐఎస్ఎఫ్) కాల్పులు జరిపారు. అసలు మూకలను నియంత్రించే విషయంలో సీఐఎస్ఎఫ్కి అవగాహన లేదు. అల్లర్ల నియంత్రణకు నిబంధనలు ఉంటాయి. మొదట లాఠీచార్జీ చేయాలి.. అనంతరం టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించాలి. ఈ విషయంలో నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు. నేను మొదటి నుంచి చెబుతున్నాను.. కేంద్ర బలగాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ఓట్లు వేసేందుకు ప్రజలను వెళ్లనివ్వాల్సిందే.. ఓట్ల ద్వారానే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారు..
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమీ చేయలేని అసమర్థులు. కూచ్ బెహార్ కాల్పుల తర్వాత వాళ్లిద్దరూ స్వీట్లు తింటూ గడిపారు. కాల్పుల ఘటన తర్వాత నాకు నిద్ర పట్టలేదు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నేను అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం అక్కడ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఎన్నికల కమిషన్ 'మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తనా నియమావళి)'ని కాస్తా ఇప్పుడు మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్ గా మార్చారు'' అని మమత మండిపడ్డారు.












Click it and Unblock the Notifications