కరోనాపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు - ఏడు రాష్ట్రాల సీఎంలకు నిర్దేశం - తిరుమల నుంచే జగన్ హాజరు
దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 700 అయినప్పటికీ.. కేవలం ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందని, మహమ్మారిని నియంత్రించడానికి ఆయా ముఖ్యమంత్రులు మరింత గట్టిగా ప్రయత్నించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ మేరకు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు.

వారం పాటు ఇలా చేయండి..
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనేవి కరోనా నియంత్రణకు ప్రాథమిక సూత్రాలని గుర్తుచేసిన ప్రధాని మోదీ.. రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్ కూడా అంత్యంత కీలకమైన అంశమని ముఖ్యమంత్రులతో అన్నారు. జిల్లా, బ్లాక్ స్థాయి నుంచి ఎప్పటికప్పుడు డేటాను సేకరించాలని, దాని ప్రకారం వైరస్ వ్యాప్తి నిరోధానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోయే వారం రోజుల పాటు కరోనాపై విసృతంగా వీడియో కాన్ఫరెన్స్ లు, సమీక్షలు నిర్వహించాలని పీఎం ఆదేశించారు.

పంపిణీలో లోపాలపై ఆగ్రహం..
ప్రధానితో కాన్ఫరెన్స్ లో కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. విపత్తు సమయంలో వివిధ రకాల మందుల పంపిణీకి సంబంధించి రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తుతుండటంపై ప్రధాని మోదీ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచం మొత్తానికి మందులు సరఫరా చేయడంలో భారత్ అగ్రగామిగా ఉంది. అలాంటిది రాష్ట్రాల మధ్య పంపిణీలో లోపాలు, అంతరాయాలు తలెత్తడమేంటి? మందులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సులభంగా చేరుకునేలా కోఆపరేట్ చేసుకుంటూ కలిసి పని చేయాలి'' అని ప్రధాని కోరారు.

ఆ 60 జిల్లాల్లోనే 77 శాతం మరణాలు..
కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 83,347 కేసులు, 1085 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సఖ్య 56.46 లక్షలకు, మరణాల సంఖ్య 90,020కు పెరిగింది. ప్రధానితో కాన్ఫెన్స్ లో సీఎంలతోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ అధికారులు సైతం పాల్గొన్నారు. మొత్తం యాక్టివ్ కేసుల్లో 63 శాతానికి పైగా ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే ఉన్నాయని, మొత్తం కేసుల్లో 65.5 శాతం, మొత్తం మరణాల్లో 77 శాతం కూడా ఆ జిల్లాల్లోనే నమోదయ్యాయని అధికారులు ప్రధానికి వివరించారు.

తిరుమల నుంచే జగన్ హాజరు..
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం బుధవారం తిరుమల వెళ్లిన ఏపీ సీఎం జగన్.. అక్కడి నుంచే ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్న మోదీ సూచనలను సీఎంలు ఆలకించారు. మొత్తం 12.42 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 6.46లక్షల కేసులతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏపీలో బుధవారం కొత్తగా 7,228 కేసులు వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 5,506గా ఉంది.












Click it and Unblock the Notifications