హిందూ మహాసభ నేత కాల్చివేత: అనుమానితుడి ఫొటో విడుదల, రూ. 50వేల రివార్డు
లక్నో: ఉత్తరప్రదేశ్ అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్ను కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన లక్నోలోని హజ్రత్గంజ్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. అందులో రికార్డైన ఫుటేజీతో అనుమానితుడి ఫొటోను విడుదల చేశారు.
అనుమానితుడి ఫొటో విడుదల.. రూ. 50వేల రివార్డు
పోలీసులు విడుదల చేసిన ఫొటోలోని అనుమానితుడి వివరాలను చెప్పిన వారికి రూ. 50వేల రివార్డును ప్రకటించారు. పోలీసులు విడుదల చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తి బ్లూ జాకెట్ ధరించి ఉన్నాడు. తెల్ల శాలువాతో తన తలను కప్పుకుని కనిపిస్తున్నాడు.
అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
రంజిత్ బచ్చన్ తలలోకి బుల్లెట్లు..
గోరఖ్పూర్ జిల్లా వాసి అయిన రంజిత్ బచ్చన్.. అతని స్నేహితుడితో కలిసి మార్నింగ్ వాక్కు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ భవంతి దగ్గర ఈ కాల్పులు జరిగాయి. దుండగుడి కాల్పుల్లో రంజిత్ తలలోకి బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు వదిలారు. మరో వ్యక్తికి కూడా బుల్లెట్లు తగలడంతో తీవ్రగాయాలపాలయ్యారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ప్రాణాలు ఎలాంటి అపాయం లేదని పోలీసులు తెలిపారు.
చోరీకి యత్నం.. పక్కా ప్లాన్ ప్రకారమే..
రంజిత్ బచ్చన్ నడస్తుండగా ముందుగా దుండగులు అతని మెడలోని బంగారు గొలుసు, సెల్ఫోన్ను లాక్కునే ప్రయత్నం చేశారని.. ఆయన ప్రతిఘటించడంతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారని చెప్పారు. అయితే, ఈ హత్య ముందుగా వేసుకున్న ప్రణాలిక ప్రకారమే జరిగినట్లు అనుమానిస్తున్నారు.
రెండో హిందూ నేత హత్య..
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షిస్తామని లక్నో డీసీపీ దినేష్ సింగ్ తెలిపారు. ఇప్పటికే నిందితుల కోసం ఆరు బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, గత అక్టోబర్ నెలలో హిందు సమాజ్ పార్టీ నేత కమలేష్ తివారీని కొందరు దుండగులు అతని ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. కమలేష్ను హత్య చేసిన అష్ఫక్ హుస్సేన్, మొయినుద్దీన్ పఠాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన మరువకముందే మరో హిందూ నేత హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది.