భారత్ లో తగ్గిన కరోనాకేసుల ఉధృతి: కానీ పెరుగుతున్న మరణాలతో ఆందోళన; తాజా పరిస్థితి ఇదే!!
భారతదేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. భారతదేశంలో బుధవారం 1,61,386 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండవ రోజు కరోనా కొత్త కేసులు తగ్గుతున్న పరిస్థితి కనిపించింది. ఇది నిన్నటితో పోలిస్తే 3.4% తక్కువగా నమోదైంది. ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,16,30,885గా ఉంది.
Recommended Video

9.26 శాతానికి పడిపోయిన రోజువారీ కేసుల రేటు
ప్రస్తుతం భారతదేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 1,21,456కి తగ్గి ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 16,21,603 వద్ద ఉంది. క్రియాశీల కేసుల రేటు 4 శాతం దిగువకు చేరింది. ఇక రోజువారీ పాజిటివ్ రేటు 9.26 శాతానికి తగ్గిపోయింది. ఇక ఈ పరిస్థితి కాస్త దేశానికి ఉపశమనం కలిగిస్తుంది. రెండేళ్ల కాలంలో 4.16 కోట్ల మందికి కరోనా మహమ్మారి సోకగా, 3.95 కోట్లమంది కరోనా మహమ్మారి నుండి బయటపడ్డారు.

గత 24 గంటల్లో 1,733 మరణాలు
గత 24 గంటల్లో 1,733 మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య విపరీతంగా పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది . ఒక్క కేరళ రాష్ట్రంలోనే 1205 మంది కరోనా కారణంగా మృతి చెందారు. అంతకు ముందు రోజు కరోనా మృతుల సంఖ్య 1192 ఉండగా గత 24 గంటల్లో 1733 మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో భారతదేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,97,975 కు చేరుకుంది. గత 24 గంటల్లో మొత్తం 2,81,109 మంది రోగులు కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు.

కరోనా రోజువారీ కేసుల్లో టాప్ ఫైవ్ రాష్ట్రాలివే
కరోనా రోజువారీ కేసులలో టాప్ ఫైవ్ లో నిలిచిన ఐదు రాష్ట్రాలు వివరాల్లోకి వెళితే అత్యధికంగా కేరళలో 51,887 కేసులు నమోదు కాగా, 16,096 కేసులతో తమిళనాడు రెండవ స్థానంలో, 14,372 కేసులతో మహారాష్ట్ర మూడవ స్థానంలో, 14,366 కేసులతో కర్ణాటక నాలుగవ స్థానంలో, 8,338 కేసులతో గుజరాత్ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి 65.1% కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క కేరళలో మాత్రమే 32.15% కొత్త కేసులు నమోదయ్యాయి.

94.91%కి చేరిన రికవరీ రేటు
భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన సాగుతుంది. గత 24 గంటల్లో మొత్తం 57,42,659 కరోనా వ్యాక్సిన్ డోస్లను అందించింది. దీనితో మొత్తం దేశ వ్యాప్తంగా 1,67,29,42,707 డోస్లను అందించారు. గత 24 గంటల్లో మొత్తం 17,42,793 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,95,11,307కి చేరుకుంది . రికవరీ రేటు ఇప్పుడు 94.91%కి చేరుకుంది.

ప్రపంచానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఆందోళన .. అలెర్ట్ అంటున్న డబ్ల్యూహెచ్ఓ
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి నుండి ఇంకా బయటపడలేదని అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 వ్యాప్తి ఒమిక్రాన్ ను మించి వేగంతో సాగుతుందని, ఇప్పటివరకు 57 దేశాలలో ఆధిపత్య వేరియంట్ గా మారిందని పేర్కొంది . ఇంకా ప్రపంచం అంతా ప్రమాదంలోనే ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక దూఅరం పాటించటం , మాస్కులు ధరించటం చెయ్యాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications