బాబోయ్.. పండుగ వేళ భారీగా 3వేలను దాటిన కరోనా కేసులు; బీ అలెర్ట్!!
భారతదేశంలో మళ్ళీ కరోనా ఆందోళన కొనసాగుతుంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 3,016 తాజా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఒక్కసారిగా 40% కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా ఒక్కసారిగా పెరిగింది. 2.7% రోజువారి పాజిటివ్ రేటు, 1.71% వారం పాజిటివిటీ రేటు నమోదయింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నవీకరించిన కరోనా డేటా ప్రకారం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య నేడు 13,509కి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసులలో 0.03% గా ఉన్నాయి. ఇదిలా ఉంటే జాతీయ కోవిడ్ రికవరీ రేటు కూడా 98.78 శాతంగా నమోదయింది. గత ఐదు నెలలుగా బాగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ ప్రస్తుతం పెరగడం ఆందోళనగా మారింది. ఇంకా గతేడాది అక్టోబర్ 2న 3,375 కరోనా కేసులు నమోదు కాగా మళ్లీ ఇప్పుడు కరోనా కేసులు మూడువేల మార్కును దాటింది.

ఇక దేశంలో తాజాగా 15 కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో ఒకరితోపాటు, కేరళలో సవరించిన డేటా తో 8మంది మరణాలు కలిపి 15మరణాలు నమోదు అయినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా శ్రీరామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
ఇప్పటికే అనేక మార్లు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి మరీ కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రతి ఒక్కరు పని చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రధానంగా కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాలలో టెస్టింగ్, ట్రేసింగ్ పెంచి కరోనా కట్టడి చెయ్యాలని కేంద్రం సూచిస్తుంది. ఇక తాజాగా హర్యానా సైతం కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications