భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు: తాజాగా 18,987 కొత్త కేసులు; 246 మరణాలు!!
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 18,987 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 246 మంది కరోనా కారణంగా మరణించారు. అంతకు ముందు రోజుతో పోల్చితే తాజాగా నమోదైన కేసులలో 19.99 శాతం పెరుగుదల కనిపించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 19,808 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం రికవరీల సంఖ్య 3,33,62,709 గా ఉంది.
భారత్ లో కరోనా తాజా అప్డేట్: 15వేలకు పైగా కొత్త కేసులు, 226 మరణాలు; క్షీణిస్తున్న యాక్టివ్ కేసులు!!
ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,20,730 గా ఉన్నట్టు తెలుస్తోంది. గత 24 గంటల్లో నమోదైన 246 మరణాలతో కలిపి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,51,435 గా నమోదయింది. బుధవారం 13,01,083 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. గత 24 గంటల్లో 35,66,347 మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 96,82,20,997గా ఉంది.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.07 శాతానికి చేరుకుంది. క్రియాశీల కేసుల రేటు 0.61 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.46 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉంది.రాబోయే మూడు నెలలు కూడా జాగ్రత్తగా ఉండాలని, కరోనా మహమ్మారితో ప్రమాదం పొంచి ఉందని కేంద్రం పదే పదే హెచ్చరిస్తోంది. కోవిడ్ వందరోజుల మిషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని పదేపదే సూచిస్తుంది.
కేరళలో 11,079 తాజా కోవిడ్-19 కేసులు మరియు 123 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,20,698 కి చేరుకోగా మరియు మరణాలు 26,571 కి చేరాయి. ఆగస్టులో ఓనం పండుగ తర్వాత 30,000 మార్కులను దాటిన తర్వాత ప్రస్తుతం మళ్లీ రాష్ట్రంలో రోజువారీ తాజా కేసుల తగ్గుదల కనిపిస్తోంది.మహారాష్ట్రలో రోజువారీ కరోనావైరస్ కేసుల సంఖ్య వరుసగా రెండవ రోజు 2,000 కంటే ఎక్కువగా నమోదవుతోంది. ఇది మొత్తం కేసులను 65,83,896కి చేర్చింది. గత 24 గంటల్లో మొత్తం 2,219 కొత్త కేసులు నమోదయ్యాయి. అండమాన్ దీవుల్లోని ఒంగే మరియు జరావా తెగలు కరోనా మహమ్మారి నుండి తీవ్రమైన ముప్పులో ఉన్నట్లు తాజా పరిశోధన సూచించింది.
గత 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలో 1280 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 19 మంది మరణించారు. మిజోరాం రాష్ట్రంలో 1224 కొత్త కేసులు నమోదు కాగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 771 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 11 మంది మరణించారు. ఒడిస్సా రాష్ట్రంలో 615 కరోనా కొత్త కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 517 కరోనా కొత్త కేసులు నమోదు కాగా ఎనిమిది మంది మరణించారు. కర్ణాటక రాష్ట్రంలో 357 కరోనా కొత్త కేసులు నమోదు కాగా పది మంది మరణించారు.దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 31 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. జీరో మరణాలు నమోదయ్యాయి.